నేడు దేశ వ్యాప్తంగా భారత్ బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సమ్మెలో పాల్గొంటున్నారు. దేశంలో కార్మిక సంస్కరణలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్డీఐ) సహా పలు అంశాలపై కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న విధానాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెను నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశంలోని పలుప్రాంతాల్లో తెల్లవారుజాము నుంచే బంద్ ప్రారంభమైంది. జనవరి 2, 2020న కేంద్ర కార్మికశాఖతో జరిగిన సమావేశంలో కార్మికుల డిమాండ్లపై భరోసా లభించలేదని, చర్చలు విఫలమైన తరువాతనే భారత్ బంద్ చేపట్టాలని నిర్ణయించుకున్నట్టు ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎంఎస్, టీయూసీసీ, ఎస్ఈడబ్ల్యూఏ, ఏఐసీసీటీయూ, సీఐటీయూ, ఏఐయూటీయూసీ, ఎల్పీఎఫ్, యూటీయూసీ వంటి 10 కేంద్ర కార్మిక సంఘాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. నేడు జరుగుతున్న భారత్ బంద్లో 25కోట్ల మంది పాల్గొంటునట్టు సమాచారం.
ముంబయి, చెన్నై, పశ్చిమ బెంగాల్, కేరళ, బీహార్, పుదుచ్చేరి, భువనేశ్వర్, హైదరాబాద్, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంతో, పాటుగా పలు ప్రాంతాల్లో ఉద్యోగులు రోడ్లపైకి చేరి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ సమ్మెలో పాల్గొంటున్నారు. పశ్చిమబెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో కొన్ని చోట్ల కార్మిక సంఘాల నేతలు రైలు పట్టాలపైకి చేరి రైల్ రోకో నిర్వహించడంతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. మరోవైపు సెంట్రల్ ట్రేడ్ యూనియన్ల పిలుపు మేరకు నేడు జరుగుతున్న భారత్ బంద్లో తమ ఉద్యోగులను పాల్గొనవద్దని కేంద్రప్రభుత్వం హెచ్చరించింది. ఇందుకు సంబంధించి ఆర్డర్లు కూడా జారీ చేసింది. ప్రభుత్వ ఉత్తర్వులను అతిక్రమించి ఎవరైనా సమ్మెలో పాల్గొంటే చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది.
[subscribe]