బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్పుత్ మృతిపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ కేసులో ఆగస్టు 19, బుధవారం నాడు సుప్రీంకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. అలాగే ఇప్పటివరకు ఈ కేసులో ముంబై పోలీసులు సేకరించిన దర్యాప్తు వివరాలను సీబీఐకి అప్పగించాలని సూచించింది. సీబీఐ విచారణకు మహారాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా సహకరించాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. గతంలోనే సుశాంత్ సింగ్ మరణంపై సీబీఐ దర్యాప్తు కోసం బీహార్ ప్రభుత్వం చేసిన సిఫారసును కేంద్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే సీబీఐ విచారణను మహారాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకించింది.
ముందుగా సుశాంత్ కేసును ముంబయి పోలీసులు దర్యాప్తు చేయడం ప్రారంభించారు. సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నాలో ఫిర్యాదు చేయడంతో బీహార్ పోలీసులు కూడా రంగంలోకి దిగారు. ఇరు రాష్ట్రాలలో విచారణ సందర్భంగా పలు సంఘటనలు చోటుచేసుకున్నాయి. అనంతరం పాట్నాలో నమోదైన కేసు ఆధారంగా సీబీఐ విచారణ మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో సుశాంత్ సింగ్ కేసు దర్యాప్తును పాట్నా నుంచి ముంబయికి బదిలీ చేయమని కోరుతూ రియా చక్రవర్తి సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విచారణలో భాగంగా సుశాంత్ కేసును సీబీఐకే అప్పగిస్తూ సుప్రీం కోర్టు కీలక తీర్పు వెల్లడించింది. అవసరమైతే కొత్తగా మళ్ళీ కేసు ఫైల్ చేసేందుకు కూడా సీబీఐకి అవకాశం ఇచ్చింది. కాగా సుశాంత్ సింగ్ కేసును సీబీఐకి అప్పగించాలని మొదటినుంచే సుశాంత్ కుటుంబ సభ్యులు, అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. తాజాగా కోర్టు నిర్ణయంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu