కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నూతన డైరెక్టర్గా కర్ణాటక డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (డీజీపీ) ప్రవీణ్ సూద్ను నియమించింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, భారత ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్, లోక్సభలో ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరిలతో కూడిన ఉన్నతస్థాయి కమిటీ ఆయన పేరును ఖరారు చేసింది. మే 25న పదవీకాలం ముగియనున్న ప్రస్తుత సీబీఐ డైరెక్టర్ సుబోధ్ కుమార్ జైస్వాల్ స్థానంలో ప్రవీణ్ సూద్ బాధ్యతలు చేపట్టానున్నారు. వచ్చే రెండేళ్లపాటు ఆయన కేంద్ర ఏజెన్సీ పదవికి అధ్యక్షుడిగా కొనసాగుతారు. హిమాచల్ ప్రదేశ్కు చెందిన ప్రవీణ్ 1986 ఇండియన్ పోలీస్ సర్వీస్ (ఐపీఎస్) బ్యాచ్ అధికారి. ఉన్నత విద్యావంతుడు అయిన ప్రవీణ్ సూద్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ )-ఢిల్లీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ (ఐఐఎం)-బెంగళూరు మరియు న్యూయార్క్లోని సిరక్యూస్ విశ్వవిద్యాలయాల నుంచి పట్టాలు అందుకున్నారు.
ఇక ప్రవీణ్ సూద్ విధి నిర్వహణలో భాగంగా కర్ణాటకలో అనేక హోదాల్లో పనిచేశారు. 2004 మరియు 2007 మధ్య పోలీస్ కమిషనర్గా, 2008 నుండి 2011 వరకు బెంగళూరు అదనపు పోలీసు కమిషనర్ (ట్రాఫిక్) గా ఉన్నారు. 2013లో, అతను కర్ణాటక రాష్ట్ర పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్గా నియమితులయ్యారు. కాగా బెంగళూరు అంతటా 276 ఎమర్జెన్సీ రెస్పాన్స్ వెహికల్స్ (హొయసల) సహాయంతో 24 గంటల సర్వీసును అందించే ‘అత్యవసర ప్రతిస్పందన వ్యవస్థ’ అయిన ‘నమ్మ 100’ని స్థాపించారు. ఆపదలో ఉన్న మహిళలు మరియు పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన ‘సురక్ష’ యాప్ మరియు మహిళా అధికారులచే నిర్వహించబడే ‘పింక్ హొయసల’ స్థాపన వంటి వాటిలో సూద్ కీలక పాత్ర పోషించారు. డ్యూటీలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచినందుకు 1996లో సీఎం గోల్డ్ మెడల్, 2002లో మెరిటోరియస్ సర్వీస్ కోసం పోలీసు పతకం, 2011లో విశిష్ట సేవకు రాష్ట్రపతి పోలీసు పతకం, 2006లో ప్రిన్స్ మైఖేల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు వంటివి ప్రవీణ్ సాధించారు.
అయితే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడైన ఒక్క రోజు వ్యవధిలోనే ప్రవీణ్ సూద్ను సీబీఐ కొత్త డైరెక్టర్గా నియమించడం గమనార్హం. ఈ నిర్ణయాన్ని కాంగ్రెస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. కర్ణాటకలో ప్రవీణ్ బీజేపీ ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేశారని, ఆయన బీజేపీని వ్యతిరేకించే వారిపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తారని ఆరోపించింది. కాగా కొన్ని నెలల క్రితం, కర్ణాటక కాంగ్రెస్ చీఫ్ డీకే శివకుమార్ కూడా సూద్పై తీవ్ర విమర్శలు చేశారు. ప్రవీణ్ సూద్ మూడేళ్లు డీజీపీగా సర్వీసులో ఉన్న కాలంలో కాంగ్రెస్ నేతలపై దాదాపు 25 కేసులు నమోదు చేశారని, కానీ రాష్ట్రంలోని బీజేపీ నేతలపై ఒక్క కేసు కూడా నమోదు చేయలేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయనపై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం ఆయనను సీబీఐ డైరెక్టర్గా నియమించడం విశేషం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE