దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం విజయవంతంగా జరుగుతుంది. ఈ నేపథ్యంలో వ్యాక్సినేషన్ ప్రక్రియపై కోవిడ్-19 వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ జాతీయ నిపుణుల బృందం చేసిన తాజాగా సిఫార్సులను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ అంగీకరించింది. ఈ మేరకు బుధవారం నాడు కేంద్రం నూతన మార్గదర్శకాలను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సమర్థవంతంగా అమలుఅయ్యేలా అవసరమైన చర్యలు చేపట్టేందుకు సంబంధిత అధికారులను ఆదేశించాలని కేంద్ర ఆరోగ్యశాఖ రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాసింది.
కరోనా వ్యాక్సినేషన్ పై కేంద్రం జారీచేసిన మార్గదర్శకాలు ఇవే:
- కరోనా బారినపడి కోలుకున్న వారు, కోలుకున్నప్పటినుంచి మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ తీసుకోవాలి.
- కరోనా చికిత్సలో భాగంగా సార్స్-2 మోనోక్లోనల్ యాంటీబాడీస్ లేదా ప్లాస్మా చికిత్స తీసుకున్నవారు ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయిన రోజు నుంచి మూడు నెలల తర్వాత వ్యాక్సిన్ వేయించుకోవాలి.
- కరోనా వ్యాక్సిన్ మొదటి డోసు తీసుకుని, రెండో డోసు తీసుకునే ముందు కరోనా వైరస్ సోకిన వ్యక్తులంతా కరోనా నుండి కోలుకున్న 3 నెలల తర్వాతనే మిగిలిన రెండో డోసు వ్యాక్సిన్ వేసుకోవాలి.
- ఇతర తీవ్ర వ్యాధులతో బాధపడుతూ ఆసుపత్రి లేదా ఐసీయూలో చికిత్స అవసరమైన వ్యక్తులు కూడా కరోనా వ్యాక్సిన్ తీసుకునే ముందు 4-8 వారాలు వేచి ఉండాలి.
- కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వారు, అలాగే కరోనా బారినపడి కోలుకుని ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన వారు 14 రోజుల తర్వాత రక్తదానం చేయవచ్చు.
- బాలింతలు కరోనా వ్యాక్సిన్ వేయించుకోవచ్చు.
- కరోనా వ్యాక్సినేషన్కు ముందు వ్యాక్సిన్ తీసుకునే వారికీ ఎలాంటి రాపిడ్ యాంటీజెన్ పరీక్షలు అవసరం లేదు.
- గర్భిణీ స్త్రీలకు కరోనా వ్యాక్సిన్ వేయడంపై నేషనల్ ఇమ్యునైజేషన్ నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ (ఎన్టిఎజిఐ) మరింతగా చర్చించి నిర్ణయం తీసుకోనుంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ