కాంగ్రెస్ నేత అగ్రనేత రాహుల్ గాంధీ మే 31న అమెరికా పర్యటనకు వెళ్లనున్నారు. పది రోజుల పర్యటనలో భాగంగా ఆయన అనేక కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఈ క్రమంలో జూన్ 4న న్యూయార్క్లోని మాడిసన్ స్వ్కేర్ గార్డెన్లో జరిగే ర్యాలీలో పాల్గొననున్న సుమారు 5,000 మంది ఎన్ఆర్ఐలను ఉద్దేశించి రాహుల్ గాంధీ ప్రసంగిస్తారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి. దీంతో పాటు వాషింగ్టన్, కాలిఫోర్నియాలో జరిగే ప్యానల్ డిస్కషన్లో పాల్గొంటారు. అలాగే స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. ఇక రాహుల్ తన అమెరికా పర్యటనలో వివిధ పార్టీలకు చెందిన పలువురు రాజకీయ నేతలు, పారిశ్రామికవేత్తలను కలుసుకుంటారు. కాగా ప్రధాని మోదీ వచ్చే నెలలో (జూన్ 22న) అమెరికా పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో.. అంతకు కొద్దిరోజుల ముందే రాహుల్ గాంధీ కూడా అమెరికాలో పర్యటించనుండటం రాజకీయంగా ప్రాధాన్యాన్ని సంతరించుకొన్నది.
ఇక రాహుల్ గాంధీ రెండు నెలల క్రితం మార్చిలో అమెరికాలో పర్యటించారు. కేంబ్రిడ్జి యూనివర్శిటీ వేదికగా జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన చేసిన వ్యాఖ్యలు కొన్ని తీవ్ర చర్చనీయాంశం అయ్యాయి. భారత్లో ప్రజాస్వామ్యం దాడికి గురవుతోందని, తనతో సహా పలువురు రాజకీయ నేతలపై అనుక్షణం నిఘా ఉంటోందని రాహుల్ చేసిన వ్యాఖ్యలు స్వదేశంలో ప్రకంపనలు సృష్టించాయి. దీనిపై మండిపడ్డ అధికార బీజేపీ భారతదేశ ప్రజాస్వామ్యాన్ని రాహుల్ విదేశాల్లో కించపరచేలా మాట్లాడారని, విదేశీ శక్తుల జోక్యాన్ని కోరారని ఆరోపిస్తూ, ఆయన దేశానికి మరియు పార్లమెంటుకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అయితే, బీజేపీ ఆరోపణలను రాహుల్ గాంధీ ఖండించారు. ప్రజాస్వామ్యాన్ని తాను కించపరచలేదని, బీజేపీ నేతలే అనేక సార్లు విదేశీ పర్యటనల్లో భారతదేశం దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోవడం లేదంటూ దేశ ప్రతిష్టను దిగజార్చే వ్యాఖ్యలు చేశారని కౌంటర్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో మరోసారి రాహుల్ అమెరికా పర్యటనకు వెళ్లనుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేకెత్తిస్తోంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE