ఢిల్లీ రాజకీయాలలో రోజుకో పరిణామం చోటుచేసుకుంటోంది. ‘ఆప్’ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని, దీనికోసం భారీగా ముడుపులు సిద్ధం చేశారని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఈ మేరకు కేజ్రీవాల్ ఒక ట్వీట్లో.. ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి వారు రూ. 800 కోట్లు కేటాయించారు. ఒక్కో ఎమ్మెల్యేకు రూ. 20 కోట్లు. అది ఎవరి డబ్బు, ఎక్కడ ఉంచబడిందో దేశం తెలుసుకోవాలనుకుంటోంది. మా ఎమ్మెల్యేలు ఎవరూ విరుచుకుపడరు. ప్రభుత్వం స్థిరంగా ఉంది. ఢిల్లీలో మంచి పని కొనసాగుతుంది’ అని పేర్కొన్నారు.
दिल्ली सरकार गिराने के लिए इन्होंने 800 करोड़ रखे हैं- प्रति MLA 20 करोड़, 40 MLA तोड़ना चाहते हैं
देश जानना चाहता है। ये 800 करोड़ किसके हैं, कहाँ रखे हैं?
हमारा कोई MLA नहीं टूट रहा। सरकार स्थिर है।दिल्ली में चल रहे सभी अच्छे काम जारी रहेंगे
— Arvind Kejriwal (@ArvindKejriwal) August 25, 2022
కాగా ఈ ఉదయం, ఆప్ ఎమ్మెల్యేలందరూ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో సమావేశమై ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బిజెపి చేస్తున్న ఆరోపణలను ఎదుర్కోవడానికి వ్యూహాన్ని రూపొందించారు. ఆ తరువాత, పార్టీ నాయకులు రాజకీయాలలో విలువలు పతనమవుతున్నాయని, ఆందోళన వ్యక్తం చేస్తూ.. మహాత్మా గాంధీ స్మారక రాజ్ఘాట్కు వెళ్లారు. రాజ్ఘాట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. ఈ వారం ప్రారంభంలో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా నివాసంలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) దాడులు నిర్వహించినప్పుడు ఏమీ స్వాధీనం చేసుకోలేకపోయిందని కేజ్రీవాల్ చెప్పారు.
ఆప్ నుండి వైదొలిగి ఢిల్లీ ప్రభుత్వాన్ని పడగొట్టేందుకు తమ 12 మంది ఎమ్మెల్యేలను బిజెపిలోని నాయకులు సంప్రదించారని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) గురువారం ప్రకటించడంతో ఒక్కసారిగా ఢిల్లీ రాజకీయాలలో కలకలం రేగింది. ఈ క్రమంలో 62 మంది ఎమ్మెల్యేలను గురువారం ఉదయం 11 గంటలకు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఇంటికి పిలిచారు. వీరిలో మనీష్ సిసోడియా, అసెంబ్లీ స్పీకర్ రామ్ నివాస్ గోయెల్ సహా ఏడుగురు నగరంలో లేకపోవడంతో హాజరుకాలేదు. మనీలాండరింగ్ ఆరోపణలకు సంబంధించిన కేసులో సత్యేందర్ జైన్ జైలులో ఉండగా, ట్రాఫిక్ రద్దీ కారణంగా అమానతుల్లా ఖాన్ చేరుకోలేకపోయారని, అయితే వీడియో కాల్లో సీఎంతో మాట్లాడారని భరద్వాజ్ చెప్పారు.
ఇక ఆప్ ఆరోపణలపై బీజేపీ ఎంపీ పర్వేశ్ వర్మ స్పందిస్తూ.. ఆ పార్టీ రాజ్ఘాట్ను కలుషితం చేస్తోందని ఆరోపించారు. మా కార్యకర్తలు దానిని గంగా జలంతో శుద్ధి చేయాలని అన్నారు. ఆప్ ప్రభుత్వాన్ని పడగొట్టాల్సి అవసరం తమకు లేదని, ప్రజలలో వారిపట్ల వ్యతిరేకతను కప్పిపుచ్చుకోవడానికే ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పాలనలో విఫలమవడం, అవినీతి కుంభకోణాలలో పార్టీ నాయకుల ప్రమేయం ఉండటం వంటి కారణాల వలన సీఎం కేజ్రీవాల్ భయపడుతున్నారని, త్వరలోనే అవినీతిపరులను మోదీ సర్కార్ అరెస్ట్ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే తమ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న ఆప్ ఆరోపణలపై వ్యాఖ్యానించేందుకు వర్మ నిరాకరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY