జూలై 3, శుక్రవారం తెల్లవారుజామున ఉత్తరప్రదేశ్ లోని కాన్పూర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఒక రౌడీ షీటర్ ను పట్టుకునే క్రమంలో జరిగిన దాడిలో డిప్యూటీ ఎస్పీ, ముగ్గురు ఎస్సైల సహా మొత్తం ఎనిమిది మంది పోలీసులు మరణించారు. కాన్పూర్ శివారులోని డిక్రూ గ్రామంలో ఉన్న రౌడీ షీటర్ వికాస్ దూబే నివాసానికి పోలీసులు చేరుకున్న సమయంలో పోలీసులపై రౌడీషీటర్లు ఒక్కసారిగా కాల్పులకు దిగారు. ఊహించని ఈ ఘటనలో ఎనిమిది మంది పోలీసులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు పోలీసులు గాయపడినట్టు తెలుస్తుంది.
రౌడీ షీటర్ వికాస్ దూబే మొత్తం 60 పైగా కేసులలో నిందితుడిగా ఉన్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనతో ఆ రాష్ట్ర పోలీస్ ఉన్నతాధికారులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చనిపోయిన పోలీసుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. పోలీసులపై కాల్పులకు పాల్పడిన రౌడీమూకలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర డీజీపీని ఆయన ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu