జపాన్ ప్రధాన మంత్రి ఫుమియో కిషిడా మార్చి 19, 20వ తేదీల్లో రెండు రోజుల పాటుగా భారత్ లో పర్యటించనున్నారు. 14వ ఇండియా-జపాన్ వార్షిక సమ్మిట్ లో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఫుమియో కిషిడా శనివారం నాడు భారత్ పర్యటనకు రానున్నట్టు కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటన చేసింది. ఈ పర్యటనలో భాగంగా జపాన్ ప్రధాని ఫుమియో కిషిడా, ప్రధాని మోదీ మధ్య కీలక భేటీ జరగనుంది. జపాన్ విదేశాంగ మంత్రిగా ఉన్న సమయంలో భారత్ కు వచ్చిన కిషిడా ప్రధాని మోదీని పలుసార్లు కలిశారు. అయితే జపాన్ ప్రధాని హోదాలో ఈ శిఖరాగ్ర సమావేశమే ఇరువురూ నేతల మధ్య తొలి సమావేశం కానుంది. ఇక మునుపటి ఇండియా-జపాన్ వార్షిక శిఖరాగ్ర సమావేశం అక్టోబర్ 2018లో టోక్యోలో జరిగిన విషయం తెలిసిందే.
భారత్ మరియు జపాన్ “ప్రత్యేక వ్యూహాత్మక మరియు ప్రపంచ భాగస్వామ్యం” పరిధిలో బహుముఖ సహకారాన్ని కలిగి ఉన్నాయని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, సుస్థిరత మరియు శ్రేయస్సు కోసం తమ భాగస్వామ్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు వివిధ రంగాలలో ద్వైపాక్షిక సహకారాన్ని సమీక్షించడానికి మరియు బలోపేతం చేయడానికి ఈ సమావేశంలో చర్చలు జరగనున్నట్టు తెలిపారు. అలాగే పరస్పర ఆసక్తి ఉన్న ప్రాంతీయ మరియు ప్రపంచ సమస్యలపై అభిప్రాయాలను మార్పిడి చేసుకోవడానికి మరియు పలు అంశాలపై చర్చలకు కూడా ఈ శిఖరాగ్ర సమావేశం అవకాశం కల్పిస్తుందని పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ