మణిపూర్ రాష్ట్రంలో చివరిదైన రెండోదశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. మణిపూర్ లో మొత్తం 60 అసెంబ్లీ స్థానాలకు గానూ ఫిబ్రవరి 28న మొదటిదశలో 38 స్థానాల్లో పోలింగ్ జరగగా భారీస్థాయిలో 88.63 శాతం పోలింగ్ నమోదైంది. ఇక రెండో దశలో భాగంగా మిగిలిన 22 అసెంబ్లీ స్థానాల్లో నేడు పోలింగ్ జరుగుతుంది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా, సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుంది. ఉదయం నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ప్రజలు పోలింగ్ బూత్ల వద్ద బారులు తీరారు. ఈ నేపథ్యంలో ఉదయం 9 గంటల వరకు 11.40 శాతం పోలింగ్ నమోదైనట్టు కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింది.
తౌబల్, కక్చింగ్, తమెంగ్లాంగ్, నోనీ, జిరిబామ్, చందేల్, తెంగ్నౌపాల్, ఉఖ్రుల్, కమ్జోంగ్ మరియు సేనాపతి వంటి 10 జిల్లాల్లోని 22 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అన్ని పార్టీల నుంచి 92 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఈ దశలో మొత్తం 8.3 లక్షల మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్ పక్రియ కోసం 1247 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఎలాంటి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోకుండా పోలింగ్ కేంద్రాల వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక ఈ దశలో మాజీ సీఎం ఓక్రం ఇబోబిసింగ్, మాజీ ఉపముఖ్యమంత్రి గైఖాంగమ్ సహా పలువురు నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మణిపూర్ లో బీజేపీ, కాంగ్రెస్, నేషనల్ పీపుల్స్ పార్టీ, జనతాదళ్, నాగా పీపుల్స్ ఫ్రంట్ వంటి పార్టీలు బరిలో ఉన్నాయి. ఇక మణిపూర్ లో మార్చి 10న కౌంటింగ్ ప్రక్రియ చేపట్టి ఎన్నికల ఫలితాలు వెల్లడించనున్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ