ఆర్థికమంత్రిగా నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1 వ తేదీన మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టబోతున్నారు. ఇప్పటికే ఐదు పూర్తిస్థాయి బడ్జెట్లు సమర్పించిన ఆమె.. భారత మాజీ ప్రధానమంత్రి మొరార్జీ దేశాయ్ తర్వాత వరుసగా ఆరు బడ్జెట్లు ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రిగా రికార్డు నెలకొల్పనున్నారు. అంతకుముందు వరుసగా ఐదు కేంద్ర బడ్జెట్లు ప్రవేశపెట్టిన అరుణ్జైట్లీ, పి.చిదంబరం, యశ్వంత్సిన్హా, మన్మోహన్సింగ్ను ఆమె అధిగమించనున్నారు. 1959-1964 మధ్య మొరార్జీ ఐదు పూర్తిస్థాయి, ఒక మధ్యంతర బడ్జెట్ను సమర్పించారు.
2019లో రెండవసారి మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మలా సీతారామన్కు ఆర్థిక శాఖ బాధ్యతలను అప్పగించారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండో మహిళగా ఆమె గుర్తింపు పొందారు. ఎప్పటిలా సూట్కేసులో కాకుండా రాజముద్ర ఉన్న ఎరుపు రంగు క్లాత్లో బడ్జెట్ ప్రతులను తీసుకొచ్చే కొత్త సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు.
కొవిడ్ సంక్షోభ సమయంలో పేద వర్గాల కోసం అనేక ఉపశమన పథకాలను ప్రవేశపెట్టారు. ఆమె హయాంలో అత్యంత వేగవంతమైన వృద్ధి నమోదు చేస్తున్న దేశంగా భారత్ కొనసాగుతోంది. మొరార్జీ దేశాయ్ అత్యధికంగా పదిసార్లు బడ్జెట్ను ప్రవేశపెట్టారు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మొదటి ఆర్థికశాఖ మంత్రి ఆర్.కె.షణ్ముగం చెట్టి తొలి బడ్జెట్ను పార్లమెంట్ ముందుకుతీసుకొచ్చారు.
2014లో నరేంద్ర మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అరుణ్ జైట్లీ కేంద్ర ఆర్థికమంత్రిగా బాధ్యతలను స్వీకరించారు. 2014-15 నుంచి 2018-2019 మధ్య వరుసగా ఐదు బడ్జెట్లు ప్రవేశపెట్టారు. అయితే ఫిబ్రవరి మంత్ చివరి రోజున బడ్జెట్ను తీసుకొచ్చే బ్రిటిష్ కాలం నాటి సంప్రదాయానికి స్వస్తి పలికి ఒకటో తారీఖుకు మార్చిన ఘనత జైట్లీదే. జైట్లీ అనారోగ్యానికి గురవటంతో.. పీయూష్ గోయల్ ఆర్థికమంత్రి బాధ్యతలు తీసుకొని 2019-2020 మధ్యంతర బడ్జెట్ను పార్లమెంట్ ముందుంచారు.
ఏప్రిల్-మేలో సార్వత్రిక ఎన్నికలు జరగనుండటంతో ప్రభుత్వం ఈసారి ఓటాన్ అకౌంట్ను ప్రవేశపెట్టనుంది. దీని ద్వారా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు నిధులను ఖర్చు పెట్టడానికి సర్కార్కు వెసులుబాటు ఉంటుంది. ఎన్నికల బడ్జెట్లో విధానపరమైన ప్రకటనలేమీ ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నట్లు సీతారామన్ డిసెంబర్ ఓ సందర్భంలో స్పష్టం చేశారు. ఓటాన్ అకౌంట్కు ఆమోదం లభిస్తే.. ఏప్రిల్-జులై కాలానికి కావాల్సిన నిధులను ప్రో-రేటా ప్రాతిపదికన ‘భారత సంఘటిత నిధి’ నుంచి ఉపసంహరించుకోవడానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. కొత్త ప్రభుత్వం కొలువుదీరాక 2024-2025కు గానూ జూన్లో ఫైనల్ బడ్జెట్ను తీసుకొస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE