దేశంలో కంటైన్మెంట్ ప్రాంతాల వెలుపల పాఠశాలలు ప్రారంభించేందుకు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలకే నిర్ణయాధికారం ఇస్తూ కేంద్రప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే విద్యార్థులు పాఠశాలలకు హాజరయ్యేందుకు తల్లిదండ్రుల వ్రాతపూర్వక అనుమతి తప్పనిసరిగా ఉండాలని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు ఇప్పటికే పాఠశాలలను తిరిగి ప్రారంభించగా, మరికొన్ని రాష్ట్రాలు మాత్రం పాఠశాలల ప్రారంభంపై ఇంకా వేచిచూస్తున్నాయి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి నవీన్ పట్నాయిక్ నేతృత్వంలోని ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా ఒడిశాలోని అన్ని పాఠశాలలు డిసెంబర్ 31, 2020 వరకు మూసివేయబడతాయని ప్రకటించారు.
కరోనా మహమ్మారి యొక్క రెండవ వేవ్ డిసెంబర్ మధ్యలో దేశాన్ని ప్రభావితం చేయొచ్చని, ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు డిసెంబర్ 31 వరకు మూసివేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. అయితే పాఠశాలల్లో ఆన్లైన్ మరియు దూరవిద్య విధానం కొనసాగుతుందని చెప్పారు. కంటెమెంట్ జోన్ల వెలుపల ఆన్లైన్ క్లాసులు మరియు ఇతర పనులు నిమిత్తం టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ ను పాఠశాలలకు పిలిచేందుకు అనుమతి ఇస్తున్నట్టు ప్రకటించారు. మరోవైపు ఒడిశాలో నవంబర్ 6, శుక్రవారం నాటికీ మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,98,768 కి చేరింది. 2,85,174 మంది కోలుకోగా, ప్రస్తుతం 12,148 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. అలాగే కరోనా వలన ఒడిశాలో ఇప్పటికి 1,446 మంది మరణించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ