పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో భారత్ తయారు చేసిన మొట్టమొదటి విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రాంత్ను కొచ్చిన్ షిప్యార్డ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. అనంతరం ఈ నౌకను జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ విక్రాంత్ భారతదేశ సముద్ర చరిత్రలో రూ.20,000 కోట్లతో నిర్మించిన అతిపెద్ద నౌక. ఈ నౌక ఇప్పుడు అధికారికంగా ఇండియన్ నేవీ ఫ్లీట్లో చేరింది. ఇది ఇండియన్ నేవీ ఇన్-హౌస్ వార్షిప్ బ్యూరోచే డిజైన్ చేయబడింది. అలాగే కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ అండ్ జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వ రంగ షిప్యార్డ్ అయిన కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్చే నిర్మించబడింది.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘కేరళ తీరంలో ఈ రోజు భారతదేశ నవశకం ప్రారంభమైంది, అమృతోత్సవ వేళ ఐఎన్ఎస్ నౌక ప్రవేశం దేశానికీ గర్వకారణం. మన సముద్ర ప్రాంతాన్ని రక్షించడానికి ఐఎన్ఎస్ విక్రాంత్ ఇప్పుడు తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది. విక్రాంత్ కేవలం యుద్ధనౌక కాదు అని, హార్డ్వర్క్, ట్యాలెంట్కు ఇది నిదర్శనం. మారిటైమ్ జోన్ను ఐఎన్ఎస్ విక్రాంత్ రక్షిస్తుంది. దీనిలో మన నేవీకి చెందిన చాలా మంది మహిళా సైనికులు బాధ్యతలు నిర్వహిస్తారు. భారతదేశ మహాసముద్రం యొక్క అపారమైన శక్తి, అపరిమితమైన స్త్రీ శక్తితో, ఇది నవ భారతదేశానికి గుర్తింపుగా మారుతుంది’ అని పేర్కొన్నారు.
అలాగే నేటి నుంచి భారత నౌకాదళానికి కొత్త జెండా అందుబాటులోకి వచ్చింది. ఇప్పటి వరకు భారతీయ నావికాదళం యొక్క జెండాపై బానిసత్వం యొక్క గుర్తింపు ఉంది. అయితే నేటి నుంచి ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో సముద్రంలో, ఆకాశంలో కొత్త నేవీ జెండా రెపరెపలాడనుంది. వలసవాద గతాన్ని తొలగించి, సుసంపన్నమైన భారతీయ సముద్ర వారసత్వానికి తగినట్లుగా కొత్త నౌకాదళ ఎన్సైన్ (నిషాన్)ని కూడా ప్రధానమంత్రి ఆవిష్కరించారు. ఈ రోజు సెప్టెంబర్ 2, 2022 చారిత్రక తేదీన భారతదేశం బానిసత్వం యొక్క జాడను, బానిసత్వ భారాన్ని తీసివేసింది అని ఈ సందర్భంగా ప్రధాని మోదీ తెలియజేశారు.
కాగా ప్రముఖ మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో రుపుదిద్దుకున్న ఓ గుర్తును ఆ జెండాలో డిజైన్ చేశారు. బ్లూ కలర్ ఆక్టోగోనల్ ఆకారంలో ఉన్న గుర్తును నేవీ జెండాలో కొత్తగా చేర్చారు. అష్టాకారంలో ఉన్న గుర్తులో రెండు గోల్డ్ కలర్ బోర్డర్లు ఉండగా, ఇవి ఎనిమిది దిక్కులను సూచిస్తాయి. దేశానికి అన్ని వైపులా భారత నౌకాదళం శత్రుదుర్భేద్యంగా ఉన్నట్లు సూచించేలా ఆ ముద్రను డిజైన్ చేసినట్లు నేవీ తెలిపింది. అప్పట్లో శివాజీకి బలమైన నౌకాదళం ఉండేది. ఆయన నౌకా దళంలో సుమారు 60 యుద్ధ నౌకలు ఉండేవని, వాటిని నిర్వహించేందుకు సుశిక్షితులైన సుమారు 5000 మంది నావికులు ఉండేవారని చరితకారులు చెప్తారు.
ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక ప్రత్యేకతలు..
- ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక గంటకు 28 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణిస్తుంది.
- ఐఎన్ఎస్ విక్రాంత్ నౌక తయారీకి 13 ఏళ్ల సమయం పట్టింది.
- అలాగే ఈ నౌక తయారీకి రూ.20 వేల కోట్లు ఖర్చయ్యింది.
- 262 మీటర్ల పొడవు.. 62 మీటర్ల వెడల్పు కలిగిన ఈ నౌక బరువు 37,500 టన్నులు.
- ఈ నౌకలో మొత్తం 14 అంతస్తులు, 2300 కాంపార్ట్మెంట్స్ ఉన్నాయి.
- ఇక దాదాపు 1600 మంది సిబ్బంది 24 గంటలూ ఈ భారీ నౌక విధుల్లో పాలుపంచుకుంటారు.
- ఇక విక్రాంత్ నౌక 2023లో తూర్పు నౌకాదళ అమ్ములపొదిలో చేరనుంది.
- రెండు టేకాఫ్ రన్వేలతో పాటు ఒక ల్యాండింగ్ స్ట్రిప్ కూడా దీనిపై నిర్మించారు.
- క్షిపణి దాడిని తట్టుకునేలా 4,28,000 టన్నుల సామర్థ్యంతో దీనిని తయారు చేశారు.
- దీనిపై ఒకేసారి 34 యుద్ధ విమానాలు – మిగ్–29కే యుద్ధ విమానాలు, కమోవ్–31 విమానాలు, ఏఎల్హెచ్ హెలికాప్టర్లు, ఎంహెచ్–60ఆర్సీ హాక్ మల్టీరోల్ హెలికాప్టర్లు వంటివి తీసుకెళ్లవచ్చు.
- ఈ భారీ యుద్ధ నౌక నిర్మాణంతో అమెరికా, రష్యా, ఇంగ్లండ్, ఫ్రాన్స్ సరసన భారత్ చేరింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ