ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం రాజస్థాన్లో పర్యటించారు. పర్యటనలో భాగంగా ఆయన రూ. 5,500 కోట్ల విలువైన అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం నాథ్ద్వారాలో పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ క్రమంలో ప్రధాని మోదీ, రాజస్థాన్ ముఖ్యంమత్రి అశోక్ గెహ్లాట్తో కలిసి ఒకే వేదిక పంచుకున్నారు. పూర్తి వైరుధ్యమున్న పార్టీల నేతలు ఇరువురూ ఇలా ఒకే వేదికపై ముచ్చటించుకుంటూ కనిపించడం చూపరులను విశేషంగా ఆకట్టుకుంది. ఇక ఈ సందర్భంగా సీఎం అశోక్ గెహ్లాట్, ప్రధాన మంత్రి సమక్షంలోనే వ్యంగ్యాస్త్రాలు సంధించడం గమనార్హం. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతిపక్షాలను గౌరవించడం తప్పనిసరి అని స్పష్టం చేశారు.
కాగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను రూ. 5500 కోట్ల కంటే ఎక్కువ విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రారంభించాను మరియు శంకుస్థాపన చేశాను. ఈ అభివృద్ధి ప్రాజెక్టులకు నేను రాజస్థాన్ ప్రజలను అభినందిస్తున్నాను. రాజస్థాన్లో ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం మరియు కనెక్టివిటీని బలోపేతం చేయడంపై మా ప్రభుత్వం దృష్టి సారిస్తోంది. ఎక్కడైనా రహదారి మరియు రైల్వే పనులు వస్తువులు మరియు సేవల రవాణాను సులభతరం చేస్తాయి. తద్వారా స్థానికంగా వాణిజ్యం పెరగడంతో పాటు ఈ ప్రాంతంలోని ప్రజల సామాజిక-ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుస్తాయని ఆశిస్తున్నాం’ అని పేర్కొన్నారు.
ఇక అంతకుముందు సీఎం గెహ్లాట్ మాట్లాడుతూ.. ‘ ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలను కూడా కలుపుకుని పోవాలి. వారికి తగిన గౌరవం ఇవ్వాలి. భావి తరాలకు ఈ చర్య మార్గదర్శకంగా నిలుస్తుంది. ప్రతిపక్షాలను గౌరవిస్తే, అధికార, ప్రతిపక్షాలు కలిసి, దేశానికి మరింత ఉత్సాహంగా సేవ చేయడం సాధ్యమవుతుంది. ప్రజాస్వామ్యంలో శత్రుత్వం అనేది ఉండదు, కేవలం సైద్ధాంతిక పోరాటమే ఉంటుంది. దేశంలో మాట్లాడే హక్కు ప్రతి ఒక్కరికీ ఉంటుందని అధికారంలో ఉన్నవారు గుర్తించాలి. ప్రతి దానినీ తిరస్కార ధోరణితో చూసేవారికి దూరదృష్టి ఉండదు. అయితే ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలను గౌరవిస్తారని ఆశిస్తున్నాను’ అని వ్యాఖ్యానించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE