దేశవ్యాప్తంగా రెండు నెలల పాటుగా లాక్ డౌన్ విధించిన నేపథ్యంలో పలు నగరాల నుంచి పెద్ద ఎత్తున స్వస్థలాలకు వెళ్లిన వలస కార్మికులు, గ్రామీణ పౌరులకు జీవనోపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా “గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్” పేరుతో పథకం ప్రారంభించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 20, శనివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా బీహార్ లోని ఖగారియా జిల్లాకు చెందిన తెలిహార్ గ్రామంలో గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ ను పీఎం మోదీ ప్రారంభించనున్నారు. మరో ఐదు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, సంబంధిత మంత్రిత్వ శాఖలకు చెందిన కేంద్ర మంత్రులు కూడా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో భౌతిక దూరాన్ని పాటిస్తూ 6 రాష్ట్రాలకు చెందిన 116 జిల్లాల్లోని గ్రామీణులు కూడా కామన్ సర్వీస్ కేంద్రాలు, కృషి విజ్ఞాన్ కేంద్రాల ద్వారా ఈ సమావేశంలో పాల్గొంటారు.
గరీబ్ కల్యాణ్ రోజ్గార్ అభియాన్ ద్వారా రూ.50 వేల కోట్ల వ్యయంతో వలస కార్మికులకు ఉపాధి కల్పించడంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక వసతుల అభివృద్ధి లక్ష్యంగా 25 విభిన్న పనులు చేపడతారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, జార్ఖండ్, ఒడిశా రాష్ట్రాల్లో 25 వేల మందికి పైగా వలస కార్మికులున్న మొత్తం 116 జిల్లాలను ఎంపిక చేశారు.116 జిల్లాల్లోని వలస కూలీలకు కనీసం 125 రోజులు పని కల్పించేలా ఈ పథకాన్ని రూపొందించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu