కర్ణాటక ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎవరిని నియమించాలనే విషయంలో ఏర్పడిన ప్రతిష్టంభనపై కాంగ్రెస్ హై కమాండ్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యనే ఎంపిక చేసినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. అయితే అధికారికంగా ప్రకటించేందుకు మరికొంత సమయం పడుతుందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఎందుకంటే మరోవైపు సీఎం పోస్టు కోసం కర్ణాటక పీసీసీ ప్రెసిడెంట్ డీకే శివకుమార్ కూడా తీవ్రంగా పోటీపడుతున్న విషయం తెలిసిందే. తాజాగా ముగిసిన అసెంబ్లీ ఎన్నికల్లో 135 సీట్లతో తిరుగులేని విజయం సాధించిన కాంగ్రెస్ పార్టీ.. సీఎం ఎన్నిక విషయంలో మాత్రం జాప్యం చేస్తోంది. దీనిపై తేల్చేందుకు సిద్ధరామయ్య, శివకుమార్ ఇద్దరిని ఢిల్లీకి పిలిపించిన కాంగ్రెస్ హై కమాండ్ పార్టీలోని సీనియర్ నేతలతో మాట్లాడిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేలు ఇరువురితో విస్తృతంగా చర్చలు జరిపారు.
అయితే డీకే శివకుమార్ పైన సీబీఐ, ఈడీ కేసులు ఉన్నందున, సిద్దరామయ్యకే సీఎం పగ్గాలు అందించాలని అధిష్టానం భావిస్తున్నట్లు సమాచారం. ఇక డీకే శివకుమార్కు ఉప ముఖ్యమంత్రి పదవితో పాటు, ఆరు కీలక మంత్రిత్వ శాఖలను కూడా ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే దీనిపై శివకుమార్ అంతగా ఆసక్తి చూపించడం లేదని తెలుస్తోంది. డిప్యూటీ సీఎం పదవిని చేపట్టేందుకు డీకే సిద్ధంగా లేరని, అలాగే క్యాబినెట్లో ఏ స్థానాన్ని ఆయన ఆశించడం లేదని సమాచారం. కాగా తొలుత ఇరువురు నేతలకు ఐదేళ్ల పదవీకాలాన్ని రెండున్నరేళ్ల చొప్పున పాలించే విధంగా రాజీ ఫార్ములాను సూచించినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. దీనిపై కూడా శివకుమార్ సుముఖత వ్యక్తం చేయలేదని, ఇస్తే సీఎం పదవి ఇవ్వమని, లేదంటే.. ఎమ్మెల్యేగానే ఉండిపోతానని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలతో సంప్రదింపులు జరుపుతోన్న కాంగ్రెస్ హై కమాండ్, త్వరలోనే మల్లికార్జున్ ఖర్గేతో అధికారిక ప్రకటన చేయించే అవకాశం ఉంది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE