సోషల్ మీడియా ప్లాట్ఫామ్ దిగ్గజం ట్విటర్కి షాక్ తగిలింది. ప్రైవసీ, సెక్యూరిటీ నిబంధనలు ఉల్లంఘించిందంటూ, అమెరికా ఫెడరల్ కోర్టు జరిమానాగా 150 మిలియన్ డాలర్లు (రూ. 1,163 కోట్లు) ఫైన్ కట్టాలంటూ తీర్పు ఇచ్చింది. ట్విటర్ కంపెనీ 2013 మే నుంచి 2019 సెప్టెంబరు మధ్య కాలంలో సంస్థ వినియోగదారులకు సంబంధించిన ఫోన్ నంబర్ సహా ఇతర కీలక సమాచారాన్ని అడ్వెర్టైజర్లకు ఇచ్చిందనే ఆరోపణల మీద అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ మరియు ఫెడరల్ ట్రేడ్ కమిషన్ (ఎఫ్టీసీ)లు విచారణ చేపట్టాయి. సుదీర్ఘ కాలం పాటు కొనసాగిన ఈ విచారణలో ట్విటర్ తన వినియోగదారుల డేటా ప్రైవసీ కాపాడటంలో న్యాయసూత్రాలకు విరుద్ధంగా ప్రవర్తించిందని రుజువు కావడంతో కోర్ట్ భారీ జరిమానా విధించింది.
అయితే కోర్టు తీర్పును గౌరవిస్తామని, ఇకపై వినియోగదారుల డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో పూర్తి బాధ్యతతో వ్యవహరిస్తామని హామీ ఇచ్చింది. ఈ మేరకు ట్విటర్ చీఫ్ ప్రైవసీ ఆఫీసర్ డామియేన్ కైరన్ కోర్టుకు తెలిపారు. వ్యక్తుల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంచేలా మరియు వారి గోప్యతను రక్షించేలా తమ కార్యకలాపాలను మెరుగుపరుచుకుంటామని స్పష్టం చేశారు. కంపెనీలో కొత్త డేటా గవర్నెన్స్ కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు నవంబర్లోనే ప్రకటించామని ఆయన గుర్తు చేశారు. కాగా గతంలో కూడా ఇలాగే తన వినియోగదారుల ప్రైవసీ హక్కుల ఉల్లంఘన విషయంలో ఫేస్బుక్ సంస్థ కూడా 2019లో 5 బిలియన్ డాలర్ల భారీ జరిమానాను చెల్లించడం గమనార్హం.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ