కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రాలు అంగీకరిస్తే ప్రజలకు భారంగా మారిన నిత్యవసరాలైన పెట్రోలియం మరియు గ్యాస్ ఉత్పత్తులను గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్టీ) పరిధిలోకి తీసుకురావచ్చని ఆమె అన్నారు. ప్రస్తుతం దేశంలోని చాలా రాష్ట్రాల్లో పెట్రోల్ రేట్లు రూ.100 పైనే ఉంటున్నాయి. దీంతో ఇంధన ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావాలని డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే మరోవైపు అలా చేస్తే రాష్ట్రాలకు వివిధ పన్నుల రూపంలో వచ్చే ఆదాయంలో కోత పడుతుందని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అవుతున్నాయి. తాజాగా నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టిన నేపథ్యంలో.. బుధవారం పీహెచ్డీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ సభ్యులతో నిర్వహించిన బడ్జెట్ అనంతర ఇంటరాక్టివ్ సెషన్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వృద్ధిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో నిర్దేశిత వ్యయాన్ని పెంచడమే ప్రభుత్వం సంవత్సరాలుగా చేస్తున్న కృషి అని, దీనిలో భాగంగా ప్రభుత్వం 2023-24 బడ్జెట్లో మూలధన వ్యయాన్ని 33 శాతం పెంచి రూ.10 లక్షల కోట్లకు చేర్చామని అన్నారు. ఇక గడిచిన మూడు, నాలుగేళ్లుగా నిరంతరంగా ప్రభుత్వ మూలధన వ్యయానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, ఈ బడ్జెట్లో దానిని నిలబెట్టుకున్నామని పేర్కొన్నారు. పెట్రోలియం మరియు గ్యాస్ ఉత్పత్తులను జీఎస్టీ పరిధిలోకి తేవొచ్చని, అయితే దీనిపై ముందుగా రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదిరితేనే అది సాధ్యమవుతుందని ఆమె స్పష్టం చేశారు. విద్యుత్తో సహా వివిధ రంగాలలో సంస్కరణలను ముందుకు తీసుకువెళ్లడానికి మరియు ‘ఒక దేశం, ఒకే రేషన్ కార్డ్’ పథకాన్ని అమలు చేయడానికి రాష్ట్రాలను ప్రోత్సహించడం జరిగిందని కూడా మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. పెట్రోలు, డీజిల్లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ పేర్కొన్న కొద్ది రోజులకే కేంద్ర ఆర్థిక మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE