రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయితీలు బహిరంగ మల మూత్ర రహిత గ్రామాలుగా (ఓ.డి.ఎఫ్) ప్రకటించిన మొట్టమొదటి రాష్ట్రంగా తెలంగాణ నిలవడం పట్ల కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యదర్శి విని మహాజన్ అభినందించారు. కేంద్ర జలశక్తి త్రాగునీటి సరఫరా, సానిటేషన్ విభాగం కేంద్ర కార్యదర్శి విని మహాజన్ బుధవారం సాయంత్రం బి.ఆర్.కె.ఆర్ భవన్ లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, పంచాయితీ రాజ్ శాఖ అధికారులతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో అమలవుతున్న పల్లె ప్రగతి కార్యక్రమాలను సీఎస్ శాంతి కుమారి కేంద్ర కార్యదర్శి విని మహాజన్ కు వివరించారు.
ఈ సందర్బంగా కేంద్ర కార్యదర్శి విని మహాజన్ మాట్లాడుతూ, ఓ.డి.ఎఫ్ లో సాధించిన విజయాలను అభినందిస్తూ, అన్ని గ్రామాలను ఓ.డి.ఎఫ్ + + గ్రామాలుగా రూపొందించాలని సూచించారు. ఓ.డి.ఎఫ్+ గ్రామాల్లో ప్రధానంగా మల సంబంధిత వ్యర్థాలు, సెప్టిక్ ట్యాంక్ మురుగునీటిని కాలువలు, నీటి వనరులు, బహిరంగ ప్రాంతాలలోకి విడుదల లేదా డంపింగ్ చేయకుండా వాటిని శుద్ధి చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. అవసరమైన గ్రామాల్లో ట్రీట్ మెంట్ ప్లాంటులను ఏర్పాటు చేయాలని కోరారు. ఓ.డి.ఎఫ్+ + గా రూపొందించడంలో తెలంగాణ దేశంలోనే మోడల్ రాష్ట్రంగా కావాలని ఆమె అభిలాషించారు. రాష్ట్రంలో ప్రతీ ఇంటికి నాణ్యమైన, శుద్ధికలిగిన తాగునీటి సరఫరా చేయడం ఒక అద్భుతమని, అయితే నీటి నాణ్యతను ఎప్పటికప్పుడు పరీక్షించాలని కోరారు. ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో అమలవుతున్నాయని, వీటన్నింటిలో గ్రామీణ పౌరులను భాగస్వాములుగా చేయాలని విని మహాజన్ సూచించారు.
సీఎస్ శాంతి కుమారి మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రతీ నెలా రూ.259 కోట్లను గ్రామ పంచాయితీలకు అందచేస్తున్నామని తెలిపారు. గ్రామ పంచాయితీలలో పది శాతం నిధులు విధిగా తెలంగాణకు హరిత హారం గ్రీనరికి వ్యయం చేసేలా చర్యలు చేపట్టామని, తద్వారా రాష్ట్రంలో గ్రీనరీ 7.7 శాతం పెరిగిందని వివరించారు. రూ.1370 కోట్ల వ్యయంతో అన్ని గ్రామాల్లో వైకుంఠధామాలు నిర్మించామని అన్నారు. అన్ని గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలను నిర్మించామని, వీటికి అదనంగా ప్రతీ మండలం, మున్సిపాలిటీలలో పది ఎకరాల విస్తీర్ణంలో 2725 బృహత్ ప్రకృతి వనాలను నిర్మిస్తున్నామని వివరించారు. రాష్ట్రంలోని 12,769 గ్రామాలకు ప్రతీ గ్రామ పంచాయితీకి ఒక ట్రాక్టర్, ఒక ట్రాలీ, వాటర్ ట్యాంకర్ లను అందచేసిన దేశంలోని మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అని సీఎస్ శాంతి కుమారి తెలియజేశారు. ఈ సమావేశంలో పంచాయితీ రాజ్ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయితీ రాజ్ శాఖ కమీషనర్ హనుమంత రావు, తదితరులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE