రెండోసారి అధికారంలోకి వచ్చాక బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఒకే దేశం- ఒకే రేషన్ కార్డును వినియోగంలోకి తీసుకొచ్చిన కేంద్ర ప్రభుత్వం, ఒకే దేశం ఒకేసారి ఎన్నికలు నినాదంపై కూడ కసరత్తు చేస్తుంది. ఇవే కాకుండా త్వరలోనే దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో వేతనాలకు సంబంధించి, ఒకే దేశం-ఒకే రోజు వేతనం అనే విధానాన్ని సైతం అమలు చేయడానికి కేంద్రం సిద్దమవుతుంది. శ్రామిక రంగాన్ని దృష్టిలో ఉంచుకుని దేశవ్యాప్తంగా వివిధ రంగాల్లో ఉన్న ఉద్యోగులు, కార్మికులందరికీ ఒకే రోజున వేతనాలు అందించడానికి ‘ఒకే దేశం-ఒకే రోజు వేతనం’ విధానం అమలు చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి సంతోష్ గంగ్వార్ నవంబర్ 15, శుక్రవారం నాడు ప్రకటించారు.
శుక్రవారం నాడు సెక్యూరిటీ లీడర్షిప్ సమ్మిట్-2019లో పాల్గొన్న మంత్రి సంతోష్ గంగ్వార్ మాట్లాడుతూ, దేశంలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారికి ప్రతి నెలా ఒకే రోజు వేతనాలు అందించేందుకు కార్యాచరణ రూపొందిస్తున్నాం. ఇందుకు సంబంధించిన చట్టాన్ని ప్రధాని నరేంద్ర మోదీ త్వరలోనే తీసుకురాబోతున్నారని చెప్పారు. అలాగే వివిధ రంగాల్లో ఉన్న కార్మికులందరికీ ఒకే స్థాయి కనీస వేతనం అమలుపైన కూడా అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మోదీ ప్రభుత్వం అనేక కార్మిక సంస్కరణలను చేపట్టిందని గంగ్వార్ పేర్కొన్నారు. ఇప్పటి వరకు సంక్లిష్టమైన 44 కార్మిక చట్టాలను సవరించే చర్యలు చేపట్టామని తెలిపారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులందరికీ త్వరలోనే రూ.3వేల పెన్షన్, వైద్య బీమా సదుపాయం కల్పించే అంశాన్ని మోదీ ప్రభుత్వం పరిశీలిస్తుందని చెప్పారు.
[subscribe]