మహారాష్ట్రలో ఎవరూ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనే అంశంపై ఇంకా అనిశ్చితి కొనసాగుతూనే ఉంది. అక్టోబర్ 24న ఫలితాలు వెలువడగా, 18 రోజులు గడిచినా కూడ మహారాష్ట్రలో ముఖ్యమంత్రి పీఠాన్ని ఎవరూ అధిరోహిస్తారనే ఉత్కంట అలాగే నడుస్తుంది. ముందుగా అతిపెద్ద పార్టీగా నిలిచిన బీజేపీను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్ ఆహ్వానించారు. అయితే శివసేన పార్టీ తమతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధంగా లేదని, సంఖ్యా బలంలేని కారణంగా ప్రభుత్వం ఏర్పాటు చేయడం లేదనే నిర్ణయాన్ని గవర్నర్ భగత్సింగ్ కోశ్యారీకి వివరించామని బీజేపీ నేత చంద్రకాంత్ పాటిల్ తెలిపారు. ప్రభుత్వ ఏర్పాటుకు బీజేపీ సుముఖత వ్యక్తంచేయని అనంతరం రెండో అతిపెద్ద పార్టీగా నిలిచిన శివసేనను ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సిందిగా ఆ పార్టీ శాసనసభ పక్ష నేత ఏక్నాథ్ షిండేకు గవర్నర్ సమాచారమిచ్చారు. సోమవారం రాత్రి 7.30 గంటల్లోగా నిర్ణయాన్ని తెలపాలని గవర్నర్ సూచించారు. గడువు విధించడంపై శివసేన అసంతృప్తి వ్యక్తం చేస్తూ, దీని వెనుక బీజేపీ పార్టీ కుట్ర ఉందని ఆ పార్టీ సీనియర్ నేత సంజయ్ రావత్ ఆరోపించారు.
గవర్నర్ పిలుపు తర్వాత ప్రభుత్వ ఏర్పాటు చేసేందుకు శివసేన తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. శివసేనకు కాంగ్రెస్, ఎన్సీపీ పార్టీల మద్దతు తప్పనిసరి కావడంతో ఆ పార్టీల నిర్ణయం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపధ్యంలో ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్తో శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్ ఠాక్రే ఈ రోజు ఓ హోటల్లో భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు కోరి, ఎన్సీపీ కాంగ్రెస్ పార్టీలకు డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చే ఆఫర్ను కూడా పవార్ తో ఠాక్రే చర్చించబోతున్నట్టు సమాచారం. మరో వైపు శివసేనతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అంశంపై ఎన్సీపీ సిద్ధంగానే ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ నిర్ణయం కోసం వేచి చూస్తున్నట్టు ఆ పార్టీ నేత నవాబ్ మాలిక్ మీడియాకు తెలిపారు. అలాగే మహారాష్ట్ర ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఈ రోజు ఉదయం భేటీ అయ్యింది. మహారాష్ట్ర కాంగ్రెస్ నేతలతో చర్చించిన తర్వాతే ఏ నిర్ణయమనేది తీసుకుంటామని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మల్లికార్జున్ ఖర్గే తెలిపారు. ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మరోసారి భేటీ అయ్యి తుది నిర్ణయాన్ని ప్రకటిస్తామని తెలిపారు. మహారాష్ట్రలో రాజకీయాలు క్షణక్షణానికి రసవత్తరంగా మారుతున్నా నేపథ్యంలో ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వ ఏర్పాటుపై గాని, రాష్ట్రపతి పాలనపై గాని స్పష్టత వచ్చే అవకాశం ఉందని పరిశీలకులు భావిస్తున్నారు.
[subscribe]