గతంలో విజయవాడ ప్రాంతంలోని ఓ వసతిగృహంలో బీఫార్మసీ విద్యార్థిని సయ్యద్ ఆయేషా మీరా దారుణ హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే హత్య జరిగిన పలు పరిణామాల అనంతరం 2018 నవంబర్ 29న హైకోర్టు ఈ కేసుపై సీబీఐ విచారణకు ఆదేశించింది. 2019 జనవరిలో ఈ కేసుపై విచారణ ప్రారంభించిన సీబీఐ, అందులో భాగంగా ఆయేషా మృతదేహానికి రీ పోస్ట్మార్టం నిర్వహించాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సీబీఐ అభ్యర్ధన మేరకు రీ పోస్ట్మార్టం చేయడానికి కోర్టు నుంచి అనుమతి లభించింది. డిసెంబర్ 14, శనివారం నాడు అయేషా మీరా మృతదేహానికి రీ పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఢిల్లీ నుంచి వచ్చిన పలువురు ఫోరెన్సిక్ నిపుణుల ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా తెనాలిలోని చెంచుపేట శ్మశానవాటికలో ఈ శవపరీక్ష నిర్వహిస్తున్నారు. ఈ రీ పోస్ట్మార్టం వ్యవహారాన్ని సీబీఐ ఎస్పీ విమల్ ఆదిత్య పర్యవేక్షిస్తున్నారు.
2007 డిసెంబర్ 27న జరిగిన ఆయేషా మీరా హత్య కేసు అప్పట్లో తీవ్ర సంచలనంగా నిలిచింది. ఈ కేసులో మొదట్లో నిందితుడుగా గుర్తించిన సత్యంబాబును 2008 ఆగస్టులో పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసుపై విచారణ చేపట్టిన విజయవాడలోని మహిళా సెషన్స్ ప్రత్యేక కోర్టు సత్యంబాబుకు 2010వ సంవత్సరంలో 14 ఏళ్లు పాటు జైలు శిక్ష విధించింది. ఆతర్వాత ఈ కేసుపై హైకోర్టులో పిటిషన్స్ దాఖలవడంతో విచారణ అనంతరం 2017 మార్చిలో సత్యంబాబును నిర్దోషిగా ప్రకటిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. ఎనిమిది సంవత్సరాల పాటు జైలు శిక్ష అనుభవించిన సత్యంబాబు హైకోర్టు తీర్పుతో విడుదలయ్యారు. ఈ క్రమంలోనే ఆయేషా హత్యకేసుపై పూర్తిస్థాయి విచారణ జరపాలని హైకోర్టు సీబీఐని ఆదేశించింది.
[subscribe]