తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధు, రైతు భీమా పథకాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రైతుభీమా పథకం కొనసాగిస్తూ నిధులు విడుదల చేసినందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కు రైతుల పక్షాన రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వ్యవసాయ శాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు రైతుభీమా కోసం రూ.1173.54 కోట్ల ప్రీమియం నిధులు విడుదల అయ్యాయి. 18 శాతం జీఎస్టీతో కలిపి రూ.1141 కోట్ల ప్రీమియం, రూ.32.54 కోట్ల స్టాంప్ డ్యూటీ నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆగస్టు 14, 2020 నుండి ఆగస్టు 13, 2021 వరకు ఈ భీమా వర్తింపు జరగనుంది. ఈ నిధులను ఎల్ఐసీకి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రస్తుతం 18 నుండి 59 సవంత్సరాల వయసుగల 32.73 లక్షల మంది రైతులు భీమా పరిధిలో ఉన్నారు.
ఈ ఏడాదితో 59 ఏండ్లు నిండిన రైతులు అనర్హులవుతుండగా, 18 ఏండ్లు నిండిన, కొత్తగా నమోదు చేసుకున్న దాదాపు రెండు లక్షల మంది రైతులు నూతనంగా రైతుభీమా పథకం పరిధిలోకి రానున్నారు. కరోనా క్లిష్ట పరిస్థితులలోనూ రైతుభీమా పథకం కొనసాగిస్తూ సీఎం కేసీఆర్ నిధులు విడుదల చేశారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. ఆగస్టు 14, 2018 న సీఎం కేసీఆర్ రైతుభీమా పథకం ప్రారంభించారని, గత రెండేళ్లలో ఎల్ఐసీకి రైతుభీమా పథకం కోసం ప్రీమియం కింద రూ. 1775.95 కోట్లు చెల్లింపు జరిగిందని చెప్పారు. అలాగే గత రెండేళ్లలో ఇప్పటి వరకు 32,267 మంది రైతు కుటుంబాలకు రైతుభీమా వర్తించిందని, ఎల్ఐసీ ద్వారా ఒక్కో రైతు కుటుంబానికి రూ.5 లక్షల చొప్పున రూ.1613.35 కోట్లు చెల్లింపులు జరిగాయని అన్నారు. ప్రపంచంలో ఎక్కడా రైతుభీమా లాంటి పథకం లేదని, ఎక్కడా మద్యవర్తి, పైరవీకారు లేకుండా సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని రూపొందించారని చెప్పారు. రైతు ఏ కారణం చేత చనిపోయినా అయిదారు రోజులలో రైతు కుటుంబానికి చెందిన ఖాతాలో రూ.5 లక్షలు జమ చేస్తున్నారు. అన్ని ప్రభుత్వ పథకాలు, సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు చేరేలా చేయడం సీఎం కేసీఆర్ పనితీరుకు నిదర్శనమని మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu