తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) కేసు నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికే, టెన్త్ పేపర్ లీకేజీ వ్యవహారం తెరపైకి తెచ్చారని ఆరోపించారు హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సోమవారం ఆయన టెన్త్ హిందీ పేపర్ లీకేజీ కేసుకి సంబంధించి పోలీసుల విచారణకు హాజరయ్యారు. కాగా ఇప్పటికే ఈ కేసులో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఒకరోజు తర్వాత హనుమకొండ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో సంజయ్ కరీంనగర్ జైలు నుంచి విడుదలయ్యారు. ఇక ఎమ్మెల్యే ఈటల ఫోన్కు ప్రశ్నాపత్రం వెళ్లడంపై పోలీసులు నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో ఈరోజు ఆయన వరంగల్ డీసీపీ ఎదుట హాజరయ్యారు. ఈ క్రమంలో దాదాపు గంట పాటు ఆయనను పోలీసులు పలు రకాలుగా ప్రశ్నించి వివరాలు తెలుసుకున్నారు.
అనంతరం ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడుతూ.. 20 ఏళ్లకు పైగా రాజకీయాల్లో ఉంటున్నానని, బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా ఎలా ఉండాలో తనకు తెలుసనీ అన్నారు. కొందరు ఆరోపిస్తున్నట్లుగా తనకు ఈ కేసులో కీలక నిందితుడు ప్రశాంత్ నుండి ఎలాంటి మెసేజ్ కానీ, ఫోన్ కానీ రాలేదని స్పష్టం చేశారు. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన పనిలేదని, అందుకే తాను సెల్ఫోన్తో సహా హాజరయ్యానని వెల్లడించారు. పోలీసులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పానని, అసలు ఇందులో పేపర్ లీక్ అనేది అబద్దమని, లీకేజీకి ఆస్కారమే లేదని, అది కేవలం మాల్ ప్టాక్టీస్ అని తేల్చిచెప్పారు. బీజేపీ పార్టీ పిల్లల భవిష్యత్ కోరే పార్టీ అని, సీఎం కేసీఆర్ ప్రగతి భవన్లో కూర్చుని బీజేపీ నేతలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. దేశంలోనే రిచెస్ట్ సీఎం కేసీఆర్ అని, ఎనిమిదేళ్ల కాలంలో ఇన్ని వేల కోట్లు ఆయనకు ఎలా వచ్చాయో ప్రజలకు వివరించాలని కోరారు. సీఎం కేసీఆర్ కుట్రలు, కేసులకు భయపడేది లేదని, తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని ఈటల రాజేందర్ అన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE