భారత రాష్ట్ర సమితి పార్టీ (బీఆర్ఎస్) అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బుధవారం బీఆర్ఎస్ లెజిస్లేచర్, పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరగనుంది. రేపు మధ్యాహ్నం 2 గంటలకు హైదరాబాద్లోని బీఆర్ఎస్ భవన్లో జరుగనున్న ఈ సమావేశానికి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు అందరూ హాజరవనున్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా జూన్ 2 నుంచి 21 రోజుల పాటు నిర్వహించనున్న తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలపై సీఎం కేసీఆర్ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఈ ఉత్సవాల నిర్వహణలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులుగా పోషించాల్సిన పాత్రపై కీలక సూచనలు చేయనున్నారు. అలాగే తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ సారథ్యంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం వివిధ రంగాల్లో సాధించిన ప్రగతిపై చర్చించనున్నారు. ఇక దశాబ్ది ఉత్సవాల నిర్వహణతోపాటు ఇతర అంశాలపై సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు సమాచారం.
కాగా తెలంగాణలో బీఆర్ఎస్కు ప్రధాన రాజకీయ ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఈ సమావేశం నిర్వహించనుండటంతో ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే కర్ణాటక ఫలితాలు ఈ ఏడాది చివర్లో జరిగే తెలంగాణ ఎన్నికలపై ప్రభావం చూపే అంశాలను సీఎం కేసీఆర్ చర్చిస్తారని భావిస్తున్నారు. ప్రత్యేకించి తమ మిత్రపక్షం జేడీఎస్ ఈ ఎన్నికల్లో ఘోరంగా దెబ్బతినడం, దాని బలం సగానికి పడిపోయిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై సీఎం కేసీఆర్ తన ఆలోచనలను నాయకులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కర్నాటకలో జేడీఎస్ నేత హెచ్డి కుమారస్వామి ముఖ్యమంత్రి కావాలని కేసీఆర్ అనేక సందర్భాల్లో కోరుకున్నారు. ఈ సమావేశానికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలని సీఎం కేసీఆర్ ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE