ఢిల్లీ మద్యం కేసుకు సంబంధించి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తాజాగా బీఆర్ఎస్ పార్టీ కీలక నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఎమ్మెల్సీ కవిత మార్చి 9, గురువారం నాడు విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసుల్లో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఈడీ జారీ చేసిన నోటీసులపై ఎమ్మెల్సీ కవిత స్పందిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు. తెలంగాణ తలవంచదు అని పేర్కొంటూ ట్విట్టర్ లో ఆమె తన ప్రకటనను షేర్ చేశారు. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా, తాను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తానని, అయితే ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్స్ కారణంగా, విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయపరమైన సలహాలను తీసుకుంటానని ఎమ్మెల్సీ కవిత పేర్కొన్నారు.
“మహిళా రిజర్వేషన్ బిల్లు చాలా కాలంగా పెండింగ్లో ఉంది. రాజకీయ భాగస్వామ్యంలో మహిళలకు సముచిత భాగస్వామ్యాన్ని కల్పించేందుకు దానిని పార్లమెంటులో ప్రవేశపెట్టాలన్నది మా ఏకైక డిమాండ్. బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేస్తూ మార్చి 10వ తేదీన జంతర్ మంతర్ వద్ద ఒక రోజు శాంతియుత నిరాహార దీక్ష కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష పార్టీలు మరియు మహిళా సంఘాలతో పాటు భారత్ జాగృతి కలిసి వస్తుంది. ఈ సంఘటనల నేపథ్యంలో, మార్చి 9వ తేదీన న్యూఢిల్లీలో హాజరుకావాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నాకు సమన్లు పంపింది. చట్టాన్ని గౌరవించే పౌరురాలిగా, నేను దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాను, అయితే ధర్నా మరియు ముందస్తు అపాయింట్మెంట్స్ కారణంగా, విచారణకు హాజరయ్యే తేదీపై న్యాయపరమైన సలహాలను తీసుకుంటాను. మా అధినేత సీఎం కేసీఆర్ పోరాటానికి, గొంతుకు వ్యతిరేకంగా, మొత్తం బీఆర్ఎస్ పార్టీపై ఈ బెదిరింపు వ్యూహాలు మమ్మల్ని అడ్డుకోలేవని కేంద్రంలోని అధికార పార్టీ తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. కేసీఆర్ నాయకత్వంలో, మేము మీ వైఫల్యాలను బహిర్గతం చేయడానికి మరియు భారతదేశానికి ఉజ్వలమైన మరియు మెరుగైన భవిష్యత్తు కోసం గొంతెత్తి పోరాడుతూనే ఉంటాము. అణచివేత ప్రజావ్యతిరేక పాలన ముందు తెలంగాణ ఎన్నడూ తలవంచబోదని ఢిల్లీలోని అధికారకాంక్ష పరులకు కూడా గుర్తు చేస్తున్నాను. ప్రజల హక్కుల కోసం నిర్భయంగా, ఉధృతంగా పోరాడుతాం” అని ఎమ్మెల్సీ కవిత ప్రకటనలో పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE