ఖమ్మంలో జరిగిన భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) భారీ బహిరంగ సభలో తెలంగాణ రాష్ట్ర సీఎం కె.చంద్రశేఖర్ రావు, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేరళ సీఎం పినరయి విజయన్, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డీ.రాజా, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, రైతు సంఘాల ప్రతినిధులు, పలు జాతీయ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సభ సందర్భంగా సీఎం కేసీఆర్ ప్రసంగిస్తూ, ఖమ్మం జిల్లాకు భారీ వరాలు ప్రకటించారు. ఖమ్మం జిల్లాలో ఇప్పుడు 589 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, ప్రతి పంచాయతీకి ముఖ్యమంత్రి ప్రత్యేక నిధి నుంచి రూ.10 లక్షలు మంజూరు చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు.
ఖమ్మం రూరల్ లో ఉన్న పెద్దతాండ మరియు కల్లూరు, ఏదులాపురం, తల్లాడ, నేలకొండపల్లి ఇలా 10 వేల జనాభాకు మించి ఉండి, మున్సిపాలిటీలు కాకుండా మేజర్ గ్రామ పంచాయతీలుగా ఉన్నాయని, వీటికి ఒక్కోదానికి రూ.10 కోట్లు మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అలాగే ఖమ్మం మున్సిపాలిటీకి ప్రత్యేకంగా రూ.50 కోట్ల నిధులను మరియు మున్నేరు నదిపై వెంటనే కొత్త బ్రిడ్జిని మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా మధిర, వైరా, సత్తుపల్లి మున్సిపాలిటీలకు తలా రూ.30 కోట్లు ప్రత్యేక నిధి మంజూరు చేస్తున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. ఖమ్మంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాల కావాలని జిల్లా నాయకులు అడుగుతున్నారని, తప్పకుండా జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీని కొత్త కోర్సులతో మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.
మరోవైపు ఖమ్మం జిల్లా హెడ్ క్వార్టర్స్ లో ఉన్న జర్నలిస్టులందరికీ ఇండ్ల స్థలాలు మంజూరు చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జర్నలిస్టులకు నెల రోజుల్లోగా ఇండ్ల స్థలాలు మంజూరు అయ్యేలా చూడాలని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు, జిల్లా అధికారులకు సీఎం కేసీఆర్ సూచించారు. కాగా ఫొటో జర్నలిస్టులు, కెమెరా జర్నలిస్టులకు కూడా ఇండ్ల స్థలాలు ఇవ్వాలని, అందరిని కవర్ చేయాలనీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE