తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో వికలాంగులకు అందిస్తున్న పింఛను మరో వెయ్యి పెంచబోతున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం మంచిర్యాల జిల్లాలో ప్రగతి నివేదన సభలో ఆయన ఈ ప్రకటన చేశారు. మంచిర్యాల జిల్లా పర్యటనలో భాగంగా నూతన కలెక్టరేట్, బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలను సీఎం కేసీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణలోని దివ్యాంగులకు ప్రస్తుతం పెన్షన్ రూ.3,116 ఇస్తున్నామని, ఇకపై వారికి మరో వెయ్యి రూపాయలు అదనంగా, అంటే.. రూ.4,116 అందించనున్నామని తెలిపారు. తెలంగాణ అభివృద్ధి, ప్రజలందరి సంక్షేమమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన వెల్లడించారు. అయితే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం బతికి ఉండాలంటే ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే అధికారం ఇవ్వాలని, 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఎలాంటి అభివృద్ధి జరగలేదని అన్నారు.
ఇంకా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉందని, దేశంలోనే 24 గంటల ఉచిత కరెంటు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని అన్నారు. ఇక దేశంలో మొత్తం 94 లక్షల ఎకరాల్లో వరి పంట సాగవుతుండగా.. ఒక్క తెలంగాణలోనే 54 లక్షల ఎకరాల్లో వరి సాగవుతుందని తెలిపారు. 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత సింగరేణి రాత, నడక మారిందని చెప్పిన సీఎం కేసీఆర్.. కార్మికులకు లాభాల వాటా పెంచామని, వచ్చే దసరాకు 700 కోట్ల బోనస్ కార్మికులకు అందజేస్తామని ప్రకటించారు. అలాగే రాష్ట్రావతరణ దశాబ్ధి ఉత్సవాల్లో భాగంగా సింగరేణి ప్రాంత ప్రజలకు ఇళ్ల పట్టాల పంపిణీ పూర్తి చేస్తామని కూడా ఆయన వెల్లడించారు. అయితే సింగరేణిని ప్రైవేట్ ప్రాతిపదికన చేస్తామని బీజేపీ ప్రభుత్వం చెబుతోందని, ఇది పక్కదోవ పట్టించడమేనని కేసీఆర్ అన్నారు. మరోవైపు ధరణిని బంగాళాఖాతంలో పెడతామని కాంగ్రెస్ పార్టీ చెబుతోందని, ధరణిని తొలగించి దళారీల రాజ్యాన్ని ఏర్పాటు చేస్తారా అని కేసీఆర్ ఆ పార్టీ నేతలను ప్రశ్నించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE