తెలుగుదేశం పార్టీ (టీడీపీ) ఇటీవల విడుదల చేసిన తొలివిడత మేనిఫెస్టో ప్రజల్లోకి వెళ్లడంలో ఐ-టీడీపీది కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు. శుక్రవారం ఆయన మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ఐ-టీడీపీ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రత్యక్షంగా తమ తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ కార్యకర్తలు చేసే ప్రచారం ఎంత ముఖ్యమో.. సోషల్ మీడియా వేదికగా ప్రచారం చేయడం కూడా అంతే ముఖ్యమని తెలిపారు. పార్టీ విధానాలను, వాణిని బలంగా వినిపించడంలో ఐ-టీడీపీ ముందుంటోందని, వచ్చే ఎన్నికల్లో ఈ విభాగం మరింత కీలకం కానుందని అభిప్రాయపడ్డారు. జగన్ సర్కార్ పాలనలోని వైఫల్యాలను ఎత్తిచూపడంలో కానీ, పార్టీపై అధికార వైసీపీ చేస్తున్న విమర్శలను తిప్పి కొట్టడంలో కానీ ఐ-టీడీపీ సమర్ధవంతంగా పనిచేస్తోందని కితాబిచ్చారు.
కాగా గత నెల 27, 28 తేదీలలో రాజమహేంద్రవరం సమీపంలోని వేమవరం వేదికగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన రెండు రోజుల మహానాడు కార్యక్రమం చివరి రోజు జరిగిన భారీ బహిరంగ సభలో చంద్రబాబు ‘భవిష్యత్ కి గ్యారెంటీ’ పేరుతో టీడీపీ తొలి దశ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటించడం తెలిసిందే. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో భవిష్యత్ కి గ్యారెంటీ మేనిఫెస్టోను మరింతగా పెంచుతామని, ప్రజల జీవితాలు సుభిక్షంగా ఉండేందుకు, రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేలా కృషి చేస్తానని టీడీపీ అధినేత హామీ ఇచ్చారు. మహాశక్తి పథకం ద్వారా మహిళలకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతున్నామని, దీనికింద ఏడాదికి మూడు సిలెండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, తల్లికి వందనం, నెలకు రూ. 1500 వంటి పథకాలతో మహిళలకు లబ్జి చేకూరుస్తామని హామీ ఇచ్చారు. అలాగే టీడీపీ అధికారంలోకి రాగానే గతంలో వలే మరోసారి నిరుద్యోగ భృతి ఇస్తామని, 20 లక్షల ఉద్యోగాల కల్పన చేపడతామని భరోసా కల్పించారు. పేదలను ధనికులుగా మార్చేందుకే ‘పూర్ టు రిచ్ స్కీం’ను తీసుకుస్తున్నామని, రాష్ట్రం మళ్ళీ అభివృద్ధి పథంలో పయనించాలన్నదే తన లక్ష్యమని చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY