తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు కొత్త రెవెన్యూ బిల్లు, వీఆర్వో వ్యవస్థ రద్దు బిల్లులను ఈ రోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ, తరతరాలుగా ప్రజల అనుభవిస్తున్న బాధలను దూరం చేసి, వారికీ మేలు చేసేందుకే కొత్త రెవెన్యూ చట్టం తీసుకోస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఈ బిల్లు వర్తిస్తుందన్నారు. గతంలో పీవీ నరసింహారావు, ఎన్టీఆర్, చంద్రబాబు, వైఎస్ఆర్ హయాంలో కొన్ని రెవెన్యూ సంస్కరణలు జరిగాయి. అయితే అవేవి రెవెన్యూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించలేదని అన్నారు. పూర్తి స్థాయిలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, ఎలాంటి అవినీతికి చోటు లేకుండా సేవలు అందించేందుకే కొత్త రెవెన్యూ చట్టం రూపొందించామని పేర్కొన్నారు.
కొత్త రెవెన్యూ చట్టంలో భాగంగా అందుబాటులోకి వచ్చే ధరణి పోర్టల్లో అన్ని వివరాలు ఉంటాయని, పూర్తి పారదర్శకంగా రూపొందించామన్నారు. ధరణి పోర్టల్ లో వ్యవసాయ, వ్యవసాయేతర విభాగాలు ఉంటాయన్నారు. ధరణి వెబ్సైట్ను ఎక్కడినుంచైనా ఓపెన్ చేసి చూసుకోవచ్చని చెప్పారు. తహసీల్దార్లు ఇకపై జాయింట్ రిజిస్టర్ లుగా వ్యవహరిస్తారని, అయితే వారికీ వ్యవసాయ భూములు మాత్రమే రిజిస్టర్ చేసే అధికారం ఉంటుందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్టర్ కార్యాలయాలలో వ్యవసాయేతర భూములు(నాన్ అగ్రికల్చర్) రిజిస్ట్రేషన్స్ జరుగుతాయని, గ్రామకంఠం భూములు, పట్టణ భూములను వ్యవసాయేతర భూములుగా పరిగణిస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే మ్యూటేషన్ చేస్తారని, మ్యూటేషన్ పవర్ను కూడా ఆర్డీవో నుంచి తొలగించి ఎమ్మార్వోకు అప్పగిస్తునట్టు తెలిపారు.
మ్యూటేషన్ కాగానే ధరణి పోర్టల్ లో వివరాలు అప్లోడ్ అవుతాయని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్, పాస్బుక్, సహా ధరణి పోర్టల్ లో కాపీని వెంటనే తీసుకోవచ్చని చెప్పారు. మరోవైపు రైతులకు జారీ చేసే రుణాల మంజూరుకు పాస్ పుస్తకాలను బ్యాంకుల్లో పెట్టుకోకూడదని, డిజిటల్ రికార్డుల ఆధారంగానే వ్యవసాయ రుణాలు అందించాలని చెప్పారు. వీఆర్వో వ్యవస్థ రద్దు కావడంతో వీఆర్వోలు ఆందోళన చెందవద్దని, వారిని స్కేల్ ఉద్యోగులుగా గుర్తిస్తామన్నారు. వారి స్థాయికి తగట్టుగా వివిధశాఖల్లో వీఆర్వోలకు ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu