హైదరాబాద్లోని ప్రముఖ నిమ్స్ ఆస్పత్రి విస్తరణలో భాగంగా నిర్మించనున్న అత్యాధునిక నూతన భవనానికి త్వరలో సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేస్తారని ఆర్థిక, ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు వెల్లడించారు. ఇందుకు సంబంధించి అన్ని ఏర్పాట్లను త్వరగా పూర్తి చేయాలని, శాఖాపరమైన అనుమతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో వైద్యారోగ్యశాఖ ఉన్నతాధికారులతో మంత్రి హరీశ్ రావు తొలిసారిగా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ నూతన భవనంలో మొత్తం 8 అంతస్తులు ఉంటాయని, అలాగే 2వేల పడకలను ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. ఓపీ, ఐపీ, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకంగా మొత్తం మూడు బ్లాకుల్లో ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కాగా ప్రస్తుతం నిమ్స్లో 1500 పడకలు ఉండగా, కొత్త భవనం పూర్తయితే పడకల సంఖ్య 3,500కు చేరుతుందని వెల్లడించారు. ఇటీవల శంకుస్థాపన చేసిన సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పూర్తికావడంతో అదనంగా మరో 200 పడకలు అందుబాటులోకి రానున్నాయని, మొత్తంగా చూస్తే నిమ్స్లో 3,700 పడకలు ఉంటాయని వివరించారు.
పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ మహానగరం నలువైపులా ఒక్కోటి వెయ్యి పడకలు కలిగి ఉండే టిమ్స్ ఆస్పత్రుల నిర్మాణంతో పాటు, నిమ్స్ ఆసుపత్రుల విస్తరణకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారని హరీశ్ రావు గుర్తు చేశారు. ఇక దేశంలోనే తొలిసారిగా గాంధీ దవాఖానలో నిర్మిస్తున్న 200 పడకల సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని, అలాగే సంతాన సాఫల్య సేవలు ప్రజలు అందుబాటులోకి తెచ్చేందుకు ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేస్తున్న ప్రభుత్వ సంతాన సాఫల్య కేంద్రం, స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ పనులు వేగవంతం చేయాలని సూచించారు. నిమ్స్లో మాదిరిగానే గాంధీ ఆస్పత్రిలోనూ అవయవ మార్పిడి శస్త్రచికిత్సలు జరిగేలా చర్యలు తీసుకోవాలని సూపరింటెండెంట్ను ఆదేశించిన మంత్రి హరీశ్ రావు.. బ్రెయిన్ డెడ్ డిక్లరేషన్లు జరిపి, అవసరమైన వారికి అవయవాలు అందించి పునర్జన్మ ప్రసాదించాలని కోరారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE