రాష్ట్రంలోని దళితుల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు పరచబోతున్న ‘‘సీఎం దళిత్ ఎంపవర్ మెంట్’’ పథకానికి సంబంధించి విధి విధానాల రూపకల్పన కోసం చర్చించడానికి జూన్ 27వ తేదీన (ఆదివారం) ప్రగతి భవన్ లో అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. ఆదివారం ఉదయం 11.30 గంటలకు ప్రగతి భవన్ లో ప్రారంభం కానున్న అఖిలపక్ష సమావేశం సుధీర్ఘంగా సాగనున్నది. ఈ సందర్భంగా మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు కూడా చేశారు. లంచ్ అనంతరం సమావేశం రోజంతా కొనసాగనున్నది.
దళిత ప్రజాప్రతినిధులతో కూడిన ఈ అఖిలపక్ష సమావేశంలో, రాష్ట్రంలోని అన్ని పార్టీలకు చెందిన దళిత ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. వారితో పాటు ప్రతిపక్ష ఎం.ఐ.ఎం, కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన ఫ్లోర్ లీడర్లు కూడా పాల్గొంటారు. వీరికి అధికారికంగా ఆహ్వానాలు అందుతాయి. సీపీఐ, సీపీఐ(ఎం) పార్టీల నుంచి సీనియర్ దళిత నేతలను సమావేశానికి పంపించాల్సిందిగా ఇప్పటికే ఆయా పార్టీల రాష్ట్ర కార్యదర్శులు చాడ వెంకట్ రెడ్డి, తమ్మినేని వీరభధ్రంలకు సీఎం కేసీఆర్ స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారు. అదే విధంగా దళిత సమస్యల పట్ల అవగాహన వుండి, దళిత వర్గాల అభ్యున్నతి కోసం పాటుపడుతున్న రాష్ట్రంలోని ఇతర సీనియర్ దళిత నాయకులను కూడా ఆహ్వనించాలని సీఎం నిర్ణయించారు. ఈ సమావేశం సందర్భంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, సీఎంఓ అధికారులతో పాటు వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన ఉన్నతాధికారులు కూడా పాల్గొననున్నారు.
‘‘నూతన తెలంగాణ రాష్ట్రంలో స్వయం పాలన ప్రారంభమైన అనతి కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం దార్శనికతతో అన్ని రంగాల్లో దళితుల సంక్షేమం అభివృద్ధి కోసం పాటుపడుతున్నది. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలోని మారుమూలన ఉన్న దళితుల జీవితాల్లో గుణాత్మకంగా అభివృద్ధిని మరింతగా సాధించాలంటే ప్రభుత్వం ఎటువంటి చర్యలు చేపట్టాలనే విషయం గురించి ఈ సమావేశం చర్చించి నిర్ణయాలు తీసుకుంటుంది. దళితుల సంక్షేమం, అభివృద్ధి కోసం పార్టీలకతీతంగా అందరం కూర్చోని మరింత క్షుణ్ణంగా చర్చించి విధివిధానాలను ఖరారు చేయడానికి ఈ అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని నిర్ణయించామని” సీఎం కేసీఆర్ తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ