తెలంగాణ కాంగ్రెస్లో కాస్త జోష్ పెరిగింది. సమరోత్సాహంతో ముందుకెళ్తోంది. ఇతర పార్టీల నుంచి కీలక నేతల రాకతో గెలుపుపై ఆశలతో ప్రచార రంగంలో దూసుకెళ్తోంది. ఎలాగైనా అధికారాన్ని చేజిక్కించుకోవాలని కొత్త వ్యూహాలతో ఈసారి ప్రణాళికలు రచిస్తోంది. దానిలో భాగంగా అభ్యర్థుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంది. రాష్ట్రంలో అత్యధిక సీట్లున్న గ్రేటర్లోని నియోజకవర్గాలకు టికెట్ల ఖరారు లో రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులను ఎంపిక చేసింది.
ఏ పార్టీకైనా ప్రభుత్వ ఏర్పాటుకు గ్రేటర్ సీట్లు ప్రధానం. అందుకే అందరూ దీనిపైనే ప్రధాన దృష్టి పెట్టారు. ప్రధానంగా అధికార పార్టీ బీఆర్ ఎస్ కు దీటైన అభ్యర్థులను బరిలోకి దించాలని యోచించారు. ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే.. గ్రేటర్ హైదరాబాద్లో కాంగ్రెస్ టికెట్ల కోసం భారీగా దరఖాస్తులు వచ్చాయి. టికెట్ కోసం ఎవరికి వారే ఢిల్లీ స్థాయిలో ప్రయత్నాలు చేశారు. పలు పార్టీల నుంచి బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరడంతో నియోజకవర్గాల్లో అభ్యర్థి ఎవరనే ఆందోళన కొద్ది రోజులు నడిచింది. అందులో ఒకటి మల్కాజిగిరి నియోజకవర్గం. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ను పార్టీ ఖరారు చేసింది. ఉమ్మడి రాష్ట్రం నుంచే మెదక్ జిల్లాలోనే తనదైన గుర్తింపు ఉన్న నేతగా పేరొందిన మైనంపల్లి అనతికాలంలోనే రాష్ట్ర రాజకీయాల్లో బలమైన నేతగా ఎదిగారు. ఈ నేపథ్యంలో మల్కాజిగిరి నుంచి తాను గెలవడమే కాదు..బాధ్యతలప్పగించే నియోజకవర్గాల్లో ఇతర అభ్యర్థులను గెలిపించడం మైనంపల్లికి సవాల్ అని చెప్పొచ్చు.
అలాగే.. ఎల్బీనగర్ కాంగ్రెస్ సిటింగ్ స్థానం.. (అభ్యర్థి ఆ తర్వాత పార్టీ మారారు..) ఎలాగైనా నిలబెట్టుకోవాలని ఆ పార్టీ భావించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి కాంగ్రెస్ కు పెట్టని కోటలా ఎల్బీనగర్ ఉన్నది. ఉమ్మడి రాష్ట్రంలోనూ, స్వరాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ఎల్బీనగర్లో ఖాతా తెరవలేదు. నియోజకవర్గంలో అన్నీ కార్పొరేటర్ స్థానాలు బీఆర్ఎస్ గెలిచినా.. ఎమ్మెల్యే వచ్చేసరికి కాంగ్రెస్ గెలిచింది. సెటిలర్లు, బలమైన సామాజికవర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది. దీంతో బీఆర్ఎస్ కు దీటైన అభ్యర్థిని దించేందుకు భారీగానే కసరత్తు చేసింది. గతంలో బీసీ నేతగా ఎల్బీనగర్ నుంచి ఆర్.కృష్ణయ గెలుపొందిన నేపథ్యంలో అదే పంథాలో ఎల్బీనగర్ స్థానాన్ని నిలబెట్టేందుకు మధుయాస్కీగౌడ్ ను రంగంలోకి దించింది.
నాంపల్లి కాంగ్రెస్ అభ్యర్థిగా ఫిరోజ్ఖాన్ దాదాపు ఖరారైనట్లే..! నాంపల్లి టికెట్ కోసం మరో ముగ్గురు నేతలు సైతం కాంగ్రెస్ నుంచి దరఖాస్తు చేసుకున్న కానీ వారిలో వివిధ సర్వేల్లో కూడా ఫిరోజ్ఖాన్దే పైచెయ్యి ఉన్నట్లు సమాచారం. గతంలో స్వల్ప ఓట్లతో ఓడిన ఫిరోజ్ఖాన్కు ప్రస్తుతం మెరుగైన అవకాశాలున్నాయని అంచనా వేసినట్లు తెలిసింది. ఇక ముషీరాబాద్ నుంచి టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ ఎంపీ అంజన్కుమార్ యాదవ్ ను బరిలోకి దించింది. అలాగే.. జూబ్లీహిల్స్ నుంచి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ ను పోటీలో నిలబెట్టింది. నియోజకవర్గంలో ఉన్న సంప్రదాయ ఓటు బ్యాంకుతోపాటు మైనార్టీ ఓట్లు తోడైతే గట్టెక్కొచ్చని కాంగ్రెస్ నాయకత్వం భావించింది. మొత్తంగా టికెట్ల కేటాయింపును పరిశీలిస్తే.. ఆ పార్టీ బాగానే కసరత్తు చేసింది. అయితే.. ఆ పార్టీ వ్యూహం గ్రేటర్ లో ఎన్ని సీట్లు రాబడుతుందో చూడాలి.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE