కోవిడ్ మరణాల రేటు జాతీయ సగటుకన్నా తెలంగాణ రాష్ట్రంలో తక్కువగా ఉన్నందుకు, కోవిడ్ నియంత్రణకు తీసుకుంటున్న చర్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా అభినందించారు. సెప్టెంబర్ 19, శనివారం నాడు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్, కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా 12 రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో ఆయా రాష్ట్రాలలో కోవిడ్ నియంత్రణ కోసం చేపడుతున్న చర్యలపై సంయుక్తంగా వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్రంలో కోవిడ్ పరీక్షల సంఖ్య గణనీయంగా పెంచడంతో పాటు అన్ని ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు, పట్టణ ఆరోగ్యకేంద్రాలు, బస్తీ దవాఖానాల్లో కరోనా పరీక్షలు నిర్వహించటం పట్ల కేంద్ర కేబినెట్ కార్యదర్శి రాష్ట్ర ప్రభుత్వాన్ని మెచ్చుకున్నారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ, కరోనా వైరస్ ను ఎదుర్కోవటానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉండటంతో పాటు, ఎప్పటికప్పుడు పరిస్ధితులను నిరంతరం సమీక్షిస్తున్నామని, రాష్ట్రంలో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గడం మొదలైందని కేంద్ర కేబినెట్ కార్యదర్శికి వివరించారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరిస్తూ రాష్ట్రంలో కరోనా పరీక్షల సంఖ్యను గణనీయంగా పెంచామని, లక్షణాలు ఉండి ర్యాపిడ్ యాంటీజెన్ టెస్ట్ లో నెగటివ్ గా రిజల్ట్ వచ్చిన వారికి కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుపత్రులలో అన్ని పడకలకు ఆక్సీజన్ సౌకర్యం కల్పించడానికి ప్రత్యేక వ్యూహన్ని అమలు చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో కోవిడ్ నియంత్రణకు ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఈ సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ, డ్రగ్స్ కంట్రోల్ డైరెక్టర్ డా.ప్రీతి మీనా మరియు ఇతర వైద్య అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu