గ్రేటర్ హైదరాబాద్ కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ఐక్యరాజ్య సమితికి చెందిన ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు హైదరాబాద్ నగరాన్ని “ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020” గా ప్రకటించాయి. హైదరాబాద్ మహానగరంలో పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పాటు వాటిని పెంచేందుకు తగు జాగ్రత్తలు చేపట్టడం ద్వారా హైదరాబాద్ నగరాన్ని ఆరోగ్యకరమైన, సంతోషకర నగరంగా రూపొందడానికి దోహదపడ్డాయి. ప్రపంచంలోని 63 దేశాల నుండి 120 నగరాలు ఎఫ్.ఏ.ఓ, ఆర్బర్ డే ఫౌండేషన్ పరిగణలోకి తీసుకోగా వీటిలో 2020 సంవత్సరానికిగాను 51 నగరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించింది. అమెరికా, బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా తదితర దేశాలకు చెందిన నగరాలు ఈ జాబితాలో ఉండగా భారతదేశం నుండి ఏకైక నగరం హైదరాబాద్ ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందింది. హైదరాబాద్ నగరం ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా గుర్తింపు పొందడం పట్ల రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ హర్షం వ్యక్తం చేశారు. హరితహారంలో భాగంగా చేపట్టిన ప్లాంటేషన్ కు ఇది లభించిన గుర్తింపు అని ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
కాగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారంలో భాగంగా గ్రేటర్ హైదరాబాద్ లో గత కొన్నేళ్లుగా కోట్లాది మొక్కలను జిహెచ్ఎంసితో పాటు ఇతర శాఖలు నాటడంతో పాటు వాటి మనుగడకు ప్రత్యేక చర్యలు చేపట్టాయి. హరిత భవిష్యత్ కు గాను మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించేందుకై ఐదు ప్రధాన లక్ష్యాలను మున్సిపల్ శాఖ చేపట్టింది. మొక్కల సంరక్షణ బాధ్యతను అప్పగించడం, మొక్కల నిర్వహణకు ప్రత్యేక నిబంధనల ఏర్పాటు, మొక్కల ప్రాధాన్యతను తెలియజేయడం, ప్రత్యేక నిధుల కేటాయింపు, చెట్ల పెంపకంపై చైతన్యం పెంచే ఉత్సవాల నిర్వహణ అనే లక్ష్యాలతో హైదరాబాద్ నగరంలో హరితహారం కార్యక్రమాన్ని చేపట్టారు. గ్రేటర్ హైదరాబాద్ లో చేపట్టిన అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ ల ఏర్పాటు, ఎవెన్యూ ప్లాంటేషన్, కార్యాలయాలు, విశ్వ విద్యాలయాలు, పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో పెద్ద ఎత్తున చేపట్టిన హరితహారం ప్లాంటేషన్ వివరాలను ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్-2020 గుర్తింపుకు రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పరిశీలించిన అనంతరం హైదరాబాద్ నగరానికి ఈ గుర్తింపునిస్తూ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ (ఎఫ్.ఏ.ఓ), ఆర్బర్ డే ఫౌండేషన్ లు ప్రకటించాయి.
హైదరాబాద్ నగరం అర్బన్, కమ్యునిటీ ఫారెస్ట్రిలో ఆదర్శవంతమైన నగరంగా ప్రపంచంలోనే పలు నగరాలకు మార్గదర్శకంగా నిలిచింది. గతంలోకన్నా పెద్ద సంఖ్యలో మొక్కలు, అడవులను పెంచడం ద్వారా హైదరాబాద్ నగరం మరింత ఆరోగ్యకరమైన, నివాసయోగ్యమైన నగరంగా రూపొందడం అభినందనీయమని ఆర్బర్ డే ఫౌండేషన్ అధ్యక్షులు డాన్ లాంబే తన సందేశంలో పేర్కొన్నారు. 2021 మార్చి 1వ తేదిన గాని అంతకుముందేగాని హైదరాబాద్ నగరాన్ని ట్రీ సిటీ ఆఫ్ ది వరల్డ్ గా ప్రకటించనున్నామని డాన్ లాంబే రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ది శాఖకు పంపిన సందేశంలో పేర్కొన్నారు.
కాగా హరితహారంలో భాగంగా కేవలం ఒక జిహెచ్ఎంసి ద్వారానే గ్రేటర్ హైదరాబాద్ లో పచ్చదనాన్ని పెంపొందించడం, ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు, ఉష్ణోగ్రతలు, పొల్యూషన్ తగ్గింపుకై చేపట్టిన ఇప్పటి వరకు 2,76,97,967 మొక్కలను నాటడం, పంపిణీ చేయడం జరిగింది. 2016 నుండి 2020 వరకు 3 కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 86.28 శాతం మొక్కలు పంపిణీ, నాటడం జరిగింది. 2020 -21 ఆర్థిక సంవత్సరంలో రెండున్నర కోట్ల మొక్కలు నాటాలనే లక్ష్యానికి గాను 2.08 కోట్ల మొక్కలను పంపిణీ, నాటడం జరిగింది. నగరంలోని 65 ప్రాంతాల్లో యాదాద్రి మోడల్ మియావాకి ప్లాంటేషన్ ను చేపట్టారు. 19 మేజర్ పార్కులు, 17 థీమ్ పార్కులు, 919 కాలనీ పార్కులు, 105 సెంట్రల్ మీడియన్ లు, 66 ట్రాఫిక్ ఐ-లాండ్ లు, 18 ఫ్లైఓవర్లు, 327 ట్రీ ఫార్కులను ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు.
Happy to share that @arborday foundation (which works with FAO of UN) has recognised Hyderabad as a Tree city of the world. The only Indian city to be included in this list
This is an acknowledgement of our efforts to improve green cover as part of #HarithaHaaram program 🎄 pic.twitter.com/nflM0svV2k
— KTR (@KTRTRS) February 18, 2021
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ