తెలంగాణలోనే కాక దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హైదరాబాద్ మైనర్ బాలిక ఘటనలో 6గురు నిందితులను అరెస్ట్ చేశామని, వారిపై కఠిన సెక్షన్లు నమోదు చేశామని పేర్కొన్నారు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. మైనర్ బాలికపై లైంగికదాడి కేసులో నేరం రుజువైతే నిందితులకు జీవితాంతం జైలు శిక్ష లేదా మరణ శిక్ష పడే అవకాశముందని తెలిపారు. ఈ మేరకు ఆయన కేసుకు సంబంధించి పూర్తి వివరాలను మంగళవారం రాత్రి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘటనలో ప్రమేయం ఉన్న 6గురిని అరెస్ట్ చేశామని, వారిలో సాదుద్దీన్ మాలిక్ మినహా మిగిలిన ఐదుగురు మైనర్లు అని, అందుకే వారి వివరాలు వెల్లడించలేమని అన్నారు.
బెంగళూరుకు చెందిన ఒక విద్యార్థి స్కూల్స్ ప్రారంభానికి ముందు హైదరాబాద్లో ఒక పార్టీ ఏర్పాటు చేయాలని భావించి, దీనికి జూబ్లీహిల్స్లోని అమ్నేషియా పబ్ను ఎంచుకున్నారని, ఆ పార్టీకి చాలామందిని ఆహ్వానించారని తెలిపారు. పార్టీ జరిగిన రోజున బాధితురాలు ఒక స్నేహితుడితో కలిసి మధ్యాహ్నం అమ్నేషియా పబ్కు వచ్చిందని, తరువాత అతను అక్కడి నుంచి వెళ్లిపోగా, ఆమె మరో స్నేహితురాలితో సాయంత్రం వరకు అక్కడే గడిపిందని తెలిపారు. ఈ సమయంలోనే సాదుద్దీన్ అనే యువకుడు వచ్చి ఆమెతో పరిచయం చేసుకున్నాడని, అనంతరం మిగిలిన ఇతర నిందితులు కూడా ఒక్కొక్కరుగా వచ్చి చేరారని చెప్పారు. అయితే వారు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించడంతో పబ్ నుంచి వెళ్లిపోవడానికి బయటకు వచ్చిందని, ఈ సమయంలోనే వారందరూ ఆమెను ఫాలో అయ్యి తాము తెచ్చుకున్న కారులోకి బలవంతంగా ఎక్కించుకుని తీసుకెళ్లారని వెల్లడించారు.
ఇంకా సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. అలా కారులో తిప్పుతూనే ఆమెపై అత్యాచారానికి ప్రయత్నించారని, తమ వికృత చర్యలన్నీ వీడియోలు తీసి సర్కులేట్ చేశారని పేర్కొన్నారు. ఈ క్రమంలో రోడ్డు నం. 44లో జన సంచారం అంతగా లేని ఒక నిర్జన ప్రదేశంలో కారును ఆపి ఒక మైనర్ ఆమెపై లైంగికదాడికి పాల్పడ్డాడని, ఆ తరువాత మిగిలినవారు కారులో రోడ్లపై తిప్పుతూ ఆమెపై లైంగికదాడి కొనసాగించారని తెలిపారు. అనంతరం బాధితురాలిని సుమారు 7:50 సమయంలో మళ్లీ పబ్ వద్దకు తీసుకొచ్చి వదిలేయగా, ఆమె తన తండ్రికి ఫోన్ చేయడంతో ఆయన వచ్చి తీసుకెళ్లాడని చెప్పారు. ఈ ఘటనలో బాధితురాలి శరీరంపై తీవ్రమైన గాయాలయ్యాయని, ప్రస్తుతం ఆమె నెమ్మదిగా కోలుకుంటోందని అన్నారు.
మే 28వ తేదీన ఈ ఘటన జరిగినప్పటికీ బాధితురాలు జరిగిన విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పలేదు. ఆమె వంటిపై గాయాలు చూసి తల్లిదండ్రులకు అనుమానం వచ్చి 31న పోలీస్ స్టేషనులో ఫిర్యాదు చేశారని తెలిపారు. అనంతరం ఆమె చెప్పిన వివరాల ఆధారంగా నిందితులను గుర్తించామని, సాదుద్దీన్ మాలిక్తోపాటు మిగిలిన ఐదుగురు మైనర్లను అరెస్టు చేశామని తెలిపారు. నిందితులపై కఠిన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ఆయా సెక్షన్లను బట్టి నిందితులపై నేరం రుజువైతే మరణించేంత వరకు జైలులోనే గడపాల్సి ఉంటుందని, లేదా మరణశిక్ష కూడా పడే అవకాశమున్నదని స్పష్టం చేశారు. బాధితురాలు మేజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం ఇచ్చిందని, దీని విచారణ ప్రత్యేక కోర్టులో జరుగుతుందని కమిషనర్ ఆనంద్ వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYF