హైదరాబాద్ లోని యూసఫ్ గూడా పోలీస్ గ్రౌండ్స్ లో బుధవారం రాత్రి ప్రముఖ నటుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నటించిన భీమ్లా నాయక్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ కు తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కు పవన్ కళ్యాణ్ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.
“కళను అక్కున చేర్చుకొని అభినందించడానికి ప్రాంతీయ, భాష, కుల, మత బేధాలు ఉండవు. భావ వైరుధ్యాలు అడ్డంకి కాబోవు, ఈ వాస్తవాన్ని మరోమారు తెలియజప్పిన తెలంగాణ రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు నిండు హృదయంతో మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఈ రోజు జరిగే బయో ఆసియా అంతర్జాతీయ సదస్సులో బిల్ గేట్స్ తో కీలకమైన వర్చువల్ మీట్ కు సన్నద్ధమవుతూ బిజీగా ఉన్నా, సమయం వెసులుబాటు చేసుకొని భీమ్లా నాయక్ ఫ్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఎంత భావ వైరుధ్యాలున్నా, రాజకీయ విమర్శలు చేసుకున్న వాటిని కళకు, సంస్కృతికి అంటనీయకపోవడం తెలంగాణ రాజకీయ నేతల శైలిలో ఉంది. ప్రస్తుత హరియాణ గవర్నర్ బండారు దత్తాత్రేయ ప్రతి ఏటా నిర్వహించే అలయ్ బలయ్ కార్యక్రమంలో అన్ని పక్షాల వారు ఆత్మీయంగా ఉండటాన్ని చూస్తాం. అటువంటి ఆత్మీయత కేటీఆర్ లో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. సృజనాత్మకత, సాంకేతికతల మేళవింపుతో కొనసాగే సినిమా రంగాన్ని ప్రోత్సహిస్తూ, ఈ రంగం అభివృద్ధికి ఆలోచనలను కేటీఆర్ చిత్తశుద్ధితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ కు హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను” అని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ