తెలంగాణలో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతుండటంతో ప్రధాన పార్టీల అభ్యర్థులంతా తమ మాటల పాశుపాతాస్త్రాలకు పదునుపెంచారు. ఇప్పటి వరకూ ఒక లెక్క..ఇక నుంచి మరో లెక్క అన్నట్లుగా ప్రచారాలలో దూసుకుపోతున్నారు. అయితే నిన్నమొన్నటి వరకూ అపోజిషన్ పార్టీల విధానాలను ఎండగడుతూ..తాము అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పుకొచ్చిన నేతలంతా సడన్గా ట్రాక్ మార్చి సెంటిమెంట్ డైలాగులకు పదును పెంచుతున్నారు..
కేసీఆర్ అంటేనే జనాలను తన సెంటిమెంట్ మాటలతో ఆకట్టుకుంటారన్న విషయం తెలిసిందే. అప్పుడు తెలంగాణను సాధించుకున్నా.. రెండు సార్లు టీఆర్ఎస్ పార్టీని అధికారంలోకి తెచ్చినా కూడా కేసీఆర్ మార్క్ సెంటిమెంట్ డైలాగ్స్ అప్పట్లో ప్రజల్లలోకి బాగానే తీసుకువెళ్లగలిగారు. దీనినే ఫాలో అయిన ఈటల రాజేందర్.. హుజురాబాద్ బై ఎలక్షన్స్ జరిగినపుడు.. ఈటల రాజేందర్ ప్రచారంలో అదే అస్త్రాన్ని తీశారు.
సీఎం కేసీఆర్ అన్యాయంగా తనను మంత్రి పదవి నుంచి అవమానకరంగా తొలగించారంటూ అప్పట్లో ప్రచారం సాగించిన ఈటల రాజేందర్.. తమ బిడ్డను సాదుకుంటారో.. చంపుకుంటారో తేల్చుకోవాలంటూ ఓటర్లను సెంటిమెంట్తోనే తమ వైపునకు తిప్పుకున్నారు. అది అప్పుడు బాగా వర్కవుట్ అయింది కూడా. అందుకే ఇప్పుడు అలాంటి స్ట్రాటజీనే ప్రధాన పార్టీల కీలక నేతలు ఫాలో అవుతున్నారు. ఠాగూర్ సినిమాలో అన్నట్లు తెలుగు ప్రజలు సెంటిమెంటల్ ఫూల్స్ అన్న డైలాగును నిజం చేయడానికి రాజకీయ ఎత్తులలో భాగంగా భావోద్వేగ డైలాగులకు నేతలు తెర లేపుతూ పొలిటికల్ హీట్ పెంచేస్తున్నారు.
తాజాగా టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇలాంటి సెంటిమెంట్ కామెంట్లనే చేశారు. కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో ‘సిద్ధిపేట నుంచి ఒకడు, సిరిసిల్ల నుంచి మరొకడు, గజ్వేల్ నుంచి ఇంకొకడు కొడంగల్కు గొడ్డలి తీసుకుని వస్తున్నారంటూ సెంటిమెంట్ రగిల్చే ప్రయత్నాన్ని చేశారు. వారి మోచేతి నీళ్లు తాగిన వారు కూడా ఇప్పుడు ఈ కుట్రలో భాగస్వాములై సహకరిస్తున్నారంటూ ఇన్ డైరక్టుగా కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, ఇతర బీఆర్ఎస్ నేతలపై పంచులేశారు. ప్రజలు పెంచిన చెట్టును వారంతా తమ గొడ్డళ్లతో నరకాలని చూస్తుంటే పౌరుషం రావడం లేదా? సెంటిమెంట్ను బాగా రగిల్చే ప్రయత్నం చేశారు.
అంతే కాదు తెలంగాణ ప్రజలు ఈ 15 రోజులుకూడా అప్రమత్తంగా ఉండాలని..ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యంగా ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తున్నారంటూ మంత్రి కేటీఆర్ రాజకీయాలలో వేడిని పెంచేసారు. ఇక కేసీఆర్ సంగతి చెప్పనక్కర లేదు. ఎక్కడికి వెళ్లినా సెంటిమెంట్తో జనాలను తనవైపు తిప్పుకోవడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య అన్న విషయం అందరికీ తెలిసిందే. రెండు సార్లు తెలంగాణ సెంటిమెంట్ను వాడిన బీఆర్ఎస్ నేతలు.. ఈ సారి సమైక్య వాద పార్టీలు కాంగ్రెస్కు మద్దతు తెలుపుతున్నాయని ప్రజలంతా అలర్ట్గా ఉండాలంటూ ప్రచారాన్ని సాగిస్తున్నాయి. మరి ఈ భావోద్వేగ ప్రసంగాలు పార్టీలకు ఎలా ఉపయోగపడుతాయన్నది కొద్ది రోజులు వేచి చూడాల్సిందే.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ