తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలవేళ పొత్తు రాజకీయాలు ఊపందుకున్నాయి. కొత్త పొత్తులు, ఎత్తులు తెరపైకి వస్తున్నాయి. ఇప్పటికీ కాంగ్రెస్ దూసుకెళ్తోంది. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది. అటు కమ్యూనిస్టు పార్టీలతో పొత్తులకు సిద్ధమవుతోంది. ఇతర చిన్న పార్టీలను కూడా కలుపుకొని పోతోంది. అయితే ఇప్పుడు మరో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. తెలంగాణ జనసమితి పార్టీ కాంగ్రెస్లో విలీనం కాబోతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఈ అంశం అరు నెలల క్రిందటే బయటకొచ్చింది. ఇటీవల రాహుల్ గాంధీతో కోదండరాం సమావేశమయినప్పటికీ మరోసారి ఈ అంశం చర్చనీయాంశంగా మారింది.
వైఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్లో విలీన ప్రతిపాదన రాగానే.. టీజేఎస్ విలీన ప్రతిపాదన కూడా తెరపైకి వచ్చింది. కానీ అప్పుడు టీజేఎస్ విలీన అంశాన్ని జనాలు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది. పోయినసారి ఎన్నికల్లో పోటీ చేసిన టీజేఎస్ అధినేత కోదండరాం ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్ మద్ధతు తీసుకొని రంగంలోకి దిగినప్పటికీ ఆయన ఓడిపోయారు. ఇప్పుడు ఎన్నికల వేళ కోదండరాం.. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో మరోసారి సమావేశం కానున్నారు. దీంతో కాంగ్రెస్లో.. టీజేఎస్ను విలీనం చేయబోతున్నారనే ప్రచారం మరోసారి జోరుగా సాగుతోంది.
రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటనలో భాగంగా శుక్రవారం కోదండరాం.. ఆయనతో సమావేశం కానున్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్ధతు ఇవ్వాల్సిందిగా.. రాహుల్ గాంధీ, కోదండరాంను కోరనున్నట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అలాగే పార్టీ విలీనం అంశంపై కూడా ఇరువురు నేతలు చర్చించే అవకాశం ఉంది.
అయితే ఈసారి టికెట్ ఆశించకపోతే.. ఇతర కీలక పదవులను ఇచ్చేందుకు కాంగ్రెస్ సిద్ధంగా ఉందని తెలుస్తోంది. టీజేఎస్ను కాంగ్రెస్లో విలీనం చేస్తే.. రాజ్యసభ ఎంపీ పదవి కానీ.. ఎమ్మెల్సీ పదవి కానీ ఇచ్చేందుకు కాంగ్రెస్ రెడీగా ఉందని సమాచారం. మరి కాంగ్రెస్ ఎరకు కోదండరాం చిక్కుతారా?.. కాంగ్రెస్లో టీజేఎస్ విలీనం అవుతుందా? కాదా? అనేది ఆసక్తికరంగా మారింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ