ప్రపంచ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. పంచ భూతాల్లో ఒకటైన నీరు జీవాధారం. నీరు లేనిదే ప్రాణి లేదు. ప్రతి ఒక్కరూ నీటి విలువను తెలుసుకుని పొదుపుగా వినియోగించుకోవాలని, ప్రతి చుక్క చుక్క నీటిని ఒడిసి పట్టి, భవిష్యత్ తరాలకు అందించాలని మంత్రి ఎర్రబెల్లి సూచించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. నీటిని ఒడిసిపట్టడంలో, వినియోగించడంలో, పొదుపు చేయడంలో సీఎం కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహం పూర్తిగా మిగతా రాష్ట్రాలకు, కేంద్రానికి విభిన్నం అన్నారు.
సీఎం కేసీఆర్ ఒకవైపు నదీజలాల్లో వాటాను పూర్తిగా సద్వినియోగం చేస్తూ, ప్రణాళికాబద్ధంగా బరాజ్లను, రిజర్వాయర్లను నిర్మిస్తూనే మరోవైపు నదుల పునరుజ్జీవనానికీ బహుముఖ వ్యూహాలను అమలు చేస్తున్నారన్నారు. మిషన్ కాకతీయ ద్వారా కాకతీయుల నాటి 27,785 గొలుసుకట్టు చెరువులు, కుంటలను బాగు చేసి, గ్రామాల్లో భూగర్భ నీటి మట్టం 4.35 మీటర్లు పెంపునకు దోహదం చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మారుమూల గూడాలు, తండాలకు కూడా నల్లాల ద్వారా శుద్ధి చేసిన, స్వచ్ఛమైన మంచినీటిని అందిస్తున్నారు. ఇవన్నీ ఇప్పుడు దేశానికే ఆదర్శంగా, దిక్సూచిగా నిలుస్తుండటం తెలంగాణకు గర్వకారణం అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నీటి కాలుష్య నివారణకు పకడ్బందీ చర్యలు చేపట్టిందని, పట్టణాల్లో మురుగునీరు చెరువులు, కుంటల్లో చేరకుండా, మురుగునీటి శుద్ధి ప్లాంట్లను, పల్లెప్రగతి పేరిట పారిశుద్ధ్యంపై ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించడంతోపాటు డంప్యార్డును ఏర్పాటు చేసి నీటి వనరులు కలుషితం కాకుండా చూస్తున్నదని చెప్పారు. తెలంగాణకు హరితహారం ఇందుకు ఊతమిస్తున్నదని అన్నారు. మొక్కల పెంపకంతో పరోక్షంగా నేల కోతకు గురికాకుండా, నీటి వనరుల్లో పూడిక చేరకుండా నిరోధిస్తున్నది. నదుల్లో ఇసుక తొలగించకుండా ప్రభుత్వమే నియంత్రిస్తున్నదని మంత్రి ఎర్రబెల్లి వివరించారు. అలాగే నీటి సంరక్షణలో ప్రజలను భాగస్వాములను చేస్తున్నది. ఉపాధి హామీలో భాగంగా పొలాల్లో ఫామ్పాండ్స్ను ఏర్పాటు చేస్తున్నదన్నారు.
తెలంగాణ ప్రభుత్వం నీటి సంరక్షణకు అమలు చేస్తున్న బహుముఖ వ్యూహాలు, ప్రణాళికబద్ధ చర్యలపై నీటి నిపుణులు, శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ప్రశంసలు కురిపిస్తున్నారు. స్కోచ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ (సీబీఐపీ) సంస్థల నుంచి జాతీయస్థాయి అవార్డులు అందుకుంటున్నదని మంత్రి అన్నారు. ప్రతి ఒక్కరూ నీటి విలువ తెలుసుకుని, పొదుపుగా వినియోగించుకోవాలని, వృథా చేయరాదని, భవిష్యత్తు తరాలకుఅ అందే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు ప్రజలకు పిలుపునిచ్చారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ