అఖిల పక్ష కమిటీల ఆధ్వర్యంలో సమన్వయంతో, స్వీయ నియంత్రణతో కరోనాని కట్టడి చేయాలని, పాలకుర్తిలో మరికొంత కాలం లాక్డౌన్ ని కొనసాగించండని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు చెప్పారు. “మద్యం దుకాణాలు, పబ్లిక్ ప్లేసులపై నిఘా పెట్టండి. మాస్కులు లేకుండా తిరిగితే భారీగా జరిమానాలు విధించండి. క్వారంటైన్ కేంద్రంగా వెలుగు స్కూల్ ని పరిశీలించండి. తద్వారా కరోనాని కట్టుదిట్టం చేయండని” ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులకు మంత్రి ఎర్రబెల్లి పిలుపునిచ్చారు. హైదరాబాద్ నుంచి పాలకుర్తి ప్రాంత ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలు, అధికారులతో మంత్రి టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరితోనూ కరోనా విస్తరణ, బాధితుల స్థితిగతులు, కరోనా కట్టడి, అభివృద్ధి పనుల కొనసాగింపు తదితర అంశాలపై మాట్లాడారు.
కరోనా విస్తరణ పల్లెలకు పాకిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. పల్లె ప్రగతి వంటి పథకాలు, నిరంతరం నిర్వహిస్తున్న పారిశుద్ధ్యం వంటి కార్యక్రమాల వల్ల కరోనా విస్తృతి కొంత అదుపులో ఉన్నప్పటికీ, అనేక మందికి సోకుతున్నదన్నారు. మొదట్లో ఉన్నంత తీవ్రత లేనప్పటికీ, ప్రజల్లో కొంత భయాందోళన ఉందన్నారు. దీన్నుంచి ప్రజలను బయటేయడానికి వీలుగా కమిటీలు పని చేయాలని మంత్రి సూచించారు. కరోనా బాధితులను ఆదుకోవడానికి కమిటీలు కృషి చేయాలన్నారు. బాధితులకవసరమైన వైద్యం, నిత్యావసర సరుకులు అందేలా చూడాలన్నారు. కరోనా కట్టడి అయ్యే వరకు పాలకుర్తిలో లాక్డౌన్ ని కొనసాగించాలని మంత్రి చెప్పారు.
మద్యం దుకాణాలు, పబ్లిక్ ప్లేసులపై నిఘా పెంచండి:
మద్యం దుకాణాలు, పబ్లిక్ పేసుల్లో ప్రజలు గుంపులు గుంపులుగా తిరగకుండా చూడాలని పోలీసులు, రెవిన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. ఆయా స్థలాలపై నిరంతరం నిఘా పెట్టాలని సూచించారు. పబ్లిక్ పేసుల్లో మద్యం సేవించే వారిని కూడా అదుపులో పెట్టాలని చెప్పారు.
మాస్కులు లేకుండా తిరిగితే భారీగా జరిమానాలు విధించండి:
ఎవరైనా సరే, మాస్కులు లేకుండా తిరిగితే, భారీగా జరిమానాలు విధించాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రతి గ్రామానికి పోలీసులు ప్రతి రోజూ వెళ్ళాలని, ఆయా గ్రామాల్లో ప్రజల్లో చైతన్యం పెంచే విధంగా ఆయా గ్రామాల సర్పంచ్ లు చాటింపులు వేయించాలని, ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.
క్వారంటైన్ కేంద్రంగా వెలుగు స్కూల్ ని పరిశీలించండి:
రోజురోజుకు కరోనా బాధితులు పెరుగుతున్నందున అలాంటి వాళ్ళందరినీ కేవలం హోం క్వారంటైన్ లో ఉంచకుండా, వెలుగు స్కూల్ ని క్వారంటైన్ కేంద్రంగా వినియోగించుకునే పరిశీలన చేయాలని స్థానికంగా ప్రజాప్రతినిధులు, అధికారులు నిర్ణయిస్తే, అందుకు తగిన ఏర్పాట్లు చేద్దామని మంత్రి తెలిపారు.
త్వరలోనే నియోజకవర్గానికి రెండు అంబులెన్స్ వాహనాలు – మరిన్ని కరోనా టెస్టింగ్ కిట్లు:
త్వరలోనే నియోజకవర్గానికి రెండు అంబులెన్స్ వాహనాలను సిద్ధం చేస్తున్నామని మంత్రి ఎర్రబెల్లి చెప్పారు. అన్నీ అనుకూలిస్తే ఈ నెల 15 లేదా 17 తేదీల్లో అందుబాటులోకి తెస్తామన్నారు. తమ ఎర్రబెల్లి ట్రస్టు ద్వారా ఈ రెండు వాహనాలను అందచేస్తున్నామని చెప్పారు. అలాగే మరిన్ని టెస్టింగ్ కిట్లు అందుబాటులోకి తెస్తామని మంత్రి అన్నారు.
రెగ్యులర్ అభివృద్ధి పనులను కొనసాగించండి:
రెగ్యులర్ గా కొనసాగాల్సిన అభివృద్ధిని సైతం కొనసాగించాలని మంత్రి ఎర్రబెల్లి ప్రజాప్రతినిధులు, అధికారులకు సూచించారు. రైతు వేదికలు, కల్లాలు, నర్సరీలు, ప్రకృతి వనాలు, డంపు యార్డులు, వైకుంఠ ధామాలు వగైరాలన్నీ వేగంగా పూర్తి కావాలన్నారు. గ్రామ పంచాయతీలు తమ నిధుల్లో 10శాతం గ్రీనరీకి వాడాలన్నారు. హరిత హారాన్ని కొనసాగించాలన్నారు. సీఎం కేసీఆర్ సూచించిన విధంగా అటు అభివృద్ధి సంక్షేమాలతోపాటు, కరోనా నియంత్రణకు ప్రజాప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పని చేయాలని, ప్రజలను కష్ట కాలంలో ఆదుకుంటేనే ప్రజాప్రతినిధులు, అధికారుల పదవులకు సార్ధకత ఏర్పడుతుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu