ప్రైవేట్ హాస్పిటల్స్ పై ప్రజల నుంచి లిఖితపూర్వకంగా వచ్చిన ఆరోపణలపై వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో మంత్రి ఈటల రాజేందర్ సోమవారం నాడు సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. “ఇప్పటివరకు ప్రైవేట్ హాస్పిటల్స్ మీద 1039 ఫిర్యాదులు వచ్చాయి. వీటిలో ముఖ్యంగా ప్రైవేట్ హాస్పిటల్స్ ఎక్కువ బిల్లులు వేయడం, బిల్లులు ఇవ్వకుండా డబ్బులు వసూలు చేయడం. మూడు నుంచి నాలుగు లక్షల రూపాయలు అడ్వాన్స్ చెల్లిస్తే తప్ప హాస్పిటల్స్ లో చేర్చుకోకపోవడం, లేదంటే బెడ్స్ ఖాళీ లేదు అని పేషంట్లను కనీసం పరీక్ష చేయకుండానే తిప్పి పంపించడం. ఇన్సూరెన్స్, క్రెడిట్ కార్డు అంగీకరించకపోవడం. డబ్బులు చెల్లించినా కూడా రోగులను సరిగా పట్టించుకోకపోవడం. చనిపోతే డబ్బులు చెల్లించక పోతే డెడ్ బాడీ ఇవ్వడం లేదంటూ పలు ఫిర్యాదులు అందాయి. కరోనా లేని వారి దగ్గర కూడా కరోనా ఉందా? లేదా ? తెలుసుకోవడానికి పరీక్షల పేరుతో డబ్బులు వసూలు చేయడంపై కూడా పలు ఫిర్యాదులు అందాయి. వేరే జబ్బుల కోసం చికిత్స చేయించుకోవడానికి హాస్పిటల్ కి వచ్చిన వారిని కరోనా నిర్ధారణ పరీక్షల కోసం కరోనా ప్యాకేజ్ పేరుతో డబ్బులు వసూలు చేస్తున్నారంటూ ఫిర్యాదులు అందాయి. వాస్తవానికి కరోనా నిర్ధారణ కోసం రాపిడ్ పరీక్ష లేదా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేసుకోవడానికి ప్రైవేట్ ఆస్పత్రులకు అనుమతులు ఉన్నాయి. కానీ అవి పక్కనపెట్టి సిటీ స్కాన్, ఎక్సే, రక్త పరీక్షల పేరుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫిర్యాదు చేశారు. రక్త పరీక్షల్లో కూడా డి-డైమర్, ఎల్డిహెచ్, సిఆర్పి,ఫెరిటిన్, ఐఎల్-6 లాంటి పరీక్షలను అవసరం లేకున్నా కూడా చేస్తున్నారంటూ పలువురు ఫిర్యాదు చేశారని” మంత్రి తెలిపారు.
హైదరాబాదులో ఉన్న దాదాపు అన్ని ఆసుపత్రులపై ఫిర్యాదులు అందటంతో ప్రతి హాస్పటల్ కు షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరడం జరిగింది. ఆసుపత్రులు ఇచ్చిన వివరణలను పరిశీలించడానికి వెంటనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు. ఈ వివరణలపై విచారణ చేసి తప్పులు చేసిన ఆసుపత్రులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. అలాగే సోమవారం నాడు కేంద్ర బృందంతో జరిగిన సమావేశంలో కూడా ప్రైవేట్ హాస్పిటల్స్ పై తీసుకుంటున్న చర్యలపై చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కేంద్ర బృందం సమర్థించింది. అంతేకాకుండా అవసరమైతే ఏపిడమిక్ డిసీజ్ ఆక్ట్ కింద ఇంకా కఠిన చర్యలు తీసుకోవాలని కేంద్ర బృందం సూచించిందని మంత్రి తెలియజేశారు. ప్రైవేట్ హాస్పిటల్ తమ తీరు మార్చుకోవాలని మరోమారు మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. ఇంకా ఇలానే కొనసాగితే ప్రతి ప్రైవేట్ ఆస్పత్రిలో ఉన్న ఐసీయూతో పాటు అన్ని బెడ్స్ లలో 50% బెడ్ లను స్వాధీనం చేసుకొని ప్రభుత్వ ఆధ్వర్యంలో, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కరోనా చికిత్సలు జరపటానికి ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను మంత్రి ఈటల రాజేందర్ ఆదేశించారు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu