తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమం అద్భుత ప్రజాదరణతో కొనసాగుతోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకూ కోటి పరీక్షలు పూర్తి చేసుకుని అరుదైన మైలురాయిని అందుకుంది. ఈ ఏడాది జనవరి 18న ప్రారంభమైన ఈ పథకం కింద కేవలం 50 రోజుల్లోనే కోటి పరీక్షలు నిర్వహించడం విశేషం. ఇక ఈ నేపథ్యంలో.. గురువారం సదాశివపేటలోని కంటి వెలుగు కార్యక్రమం కేంద్రాన్ని సందర్శించిన మంత్రి హరీశ్రావు బెలూన్లను గాల్లోకి ఎగురవేశారు. కేక్ కట్ చేసి అక్కడి సిబ్బందికి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. కోటి కంటి పరీక్షలు జరుపుకోవడం చాలా గొప్ప విషయమని, ఈ కార్యక్రమం ద్వారా 29 లక్షల మందికి కళ్లజోళ్లు ఉచితంగా అందజేశామని తెలిపారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ కంటి సంబంధిత సమస్యలతో బాధపడకూడదనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ కంటి వెలుగు పథకం తీసుకొచ్చారని వెల్లడించారు.
ఇక ఈ తరహా కార్యక్రమంలో ప్రపంచంలో ఎక్కడా లేదని పేర్కొన్న మంత్రి హరీశ్రావు.. ఈ పథకాన్ని ప్రతిపక్షాలు సైతం మెచ్చుకున్నాయని తెలిపారు. ఇతర రాష్ట్రాల సీఎంలు అరవింద్ కేజ్రీవాల్, మాన్సింగ్ తదితరులు ఈ పథకాన్ని ప్రశంసించారని, వారి రాష్ట్రాల్లో కూడా అమలు చేయడానికి ప్రయత్నం చేస్తామని ఖమ్మంలో జరిగిన భారీ బహిరంగ సభలో చెప్పారని గుర్తు చేశారు. 50 రోజుల్లోనే కోటి కంటి పరీక్షలు పూర్తి చేశారని , 53 లక్షల మంది మహిళలు, 47 లక్షల మంది పురుషులకు కంటి వెలుగు పరీక్షలు నిర్వహించామని తెలిపారు. దీనికోసం 1500 మంది కంటి వెలుగు టీమ్స్ కష్టపడి పని చేశాయని, 55 శాతం గ్రామాల్లో కంటి పరీక్షలు పూర్తి చేశామని చెప్పారు. ఇక పరీక్షల తర్వాత దగ్గర చూపు సమస్య ఉన్న 16.50 లక్షల మందికి, దూరపు చూపు సమస్యతో బాధపడుతున్న మరో 12.50 లక్షల మందికి ఉచితంగా కంటి అద్దాలు అందజేశామని మంత్రి హరీశ్రావు వెల్లడించారు.
ఈ తొమ్మిదేళ్లలో తెలంగాణలో వైద్య రంగం అద్భుతమైన ప్రగతి సాధించిందని, రాష్ట్రవ్యాప్తంగా పల్లె దవాఖానాలు, మున్సిపాలిటీల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి ప్రజలకు వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చామని మంత్రి హరీశ్ రావు తెలిపారు. కాగా తెలంగాణలో వైద్యరంగం మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్ చెప్పిందని, అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం రాష్ట్రానికి ఒక్క ఎయిమ్స్ కేటాయించి, అదే గొప్ప విషయం అన్నట్లుగా ప్రచారం చేసుకుంటోందని ఎద్దేవా చేశారు. కానీ సీఎం కేసీఆర్ సూచనలతో తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాదిలోనే కొత్తగా 9 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసిందని, టీ డయాగ్నోస్టిక్ సెంటర్స్ ద్వారా 57 రకాల వైద్య పరీక్షలు ఉచితంగా అందజేస్తున్నామని వివరించారు. ఇక త్వరలోనే గర్భిణులకు న్యూట్రీషన్ కిట్లు అందించబోతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం అమలుచేయనున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE