హైదరాబాద్ పరిధిలోని జవహర్నగర్ మరియు దాని పరిసర ప్రాంతాలలో నీటి కాలుష్యం లేకుండా చూసేందుకు గానూ, అక్కడి డంపింగ్ యార్డులో గత కొన్నేళ్లుగా పేరుకుపోయిన కాలుష్య కారక వ్యర్థాలను శుద్ధి చేసే ప్రక్రియలో భాగంగా.. లీచెట్ (లిక్విడ్ వేస్ట్) ట్రీట్మెంట్ ప్లాంట్ను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసింది. దాదాపు రూ. 250 కోట్లతో రాంకీ సంస్థ రెండు ఎంఎల్డీల సామర్థ్యంతో దీనిని నిర్మించింది. ఈ ప్లాంట్ను పురపాలక శాఖ మంత్రి మంత్రి కేటీఆర్ మరో మంత్రి మల్లారెడ్డితో కలిసి శనివారం ప్రారంభించారు. అనంతరం జీవో నెం.58 కింద 3,619 మంది లబ్ధిదారులకు పట్టాలు అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నగరంలోని చెత్త సమస్యను తీర్చేందుకు జవహర్నగర్లో డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేశారని, అయితే దశాబ్దాల పాటు అధికారంలో ఉన్న గత ప్రభుత్వాలు చెత్తకుప్పలు పోసి, దుర్గంధం వచ్చేటట్టు చేసి దీనిని వారసత్వంగా ఇచ్చి వెళ్లాయని తెలిపారు. తెలంగాణ ఏర్పడ్డాక సీఎం కేసీఆర్ దీనిపై ప్రత్యేక దృష్టి పెట్టారని, డంపింగ్ యార్డ్లో వేల, లక్షల టన్నుల చెత్త ఉండటం మూలాన ఆ ప్రాంత ప్రజలకు ఆరోగ్యపరంగా సమస్యలు వస్తున్నాయని గుర్తించి మంత్రులకు, అధికారులకు దీనికి పరిష్కారం చూపాలని ఆదేశించారు. జవహర్నగర్ డంపింగ్ యార్డ్ మొదలుపెట్టినప్పుడు హైదరాబాద్ నుంచి 3వేల మెట్రిక్ టన్నుల చెత్త వచ్చేదని, కానీ ఇప్పుడు 8 వేల మెట్రిక్ టన్నుల చెత్త వస్తుందని, ఇలాగె పెరిగి ఇంకో వెయ్యి టన్నులు అయితే మూడు రెట్ల చెత్త అవుతుందని వెల్లడించారు.
దీంతో శాస్త్రీయంగా అత్యుత్తమ పద్ధతులు ఏం ఉన్నాయని ఆలోచన చేసి వాటికి అనుగుణంగా కొన్ని కార్యక్రమాలు చేపట్టామని మంత్రి కేటీఆర్ తెలిపారు. దీనిలో భాగంగా చేతను రెండు రకాలుగా విభజించి, ప్రస్తుతం జవహర్నగర్ తీసుకొచ్చిన చెత్తలో తడి చెత్త నుంచి ఎరువు ఉత్పత్తి చేసి.. దాన్ని రైతులకు అమ్ముతున్నామని, అలాగే పొడి చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తున్నామని వివరించారు. ఈ క్రమంలో రూ.550 కోట్లతో దక్షిణ భారతదేశంలోనే పెద్దదైన చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేసే 20 మెగావాట్ల విద్యుత్తు యూనిట్ను ప్రారంభించామన్న మంత్రి.. మరొక రూ.550 కోట్లతో మరో 28వేల మెగావాట్ల విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. ఇక మూడో రకం చెత్త.. ఇళ్ళు కట్టినప్పుడు, కూలగొట్టినప్పుడు కంకర, రాళ్లు, మట్టి రూపంలో వస్తుందని, ఈ శిథిలాల నుంచి వచ్చే ఈ వ్యర్థాలను పునరుత్పత్తి చేసి.. పునర్వినియోగం చేసి వాటి నుంచే సిమెంట్, బ్రిక్స్, ఫుట్పాత్ మీద వేసే టైల్స్ తయారుచేస్తున్నామని, అలాగే కంకర నుంచి డస్ట్ తయారుచేస్తున్నామని మంత్రి కేటీఆర్ తెలిపారు.
కాగా జవహర్నగర్ డంప్యార్డులో పెద్ద ఎత్తున వ్యర్ధాలు పేరుకుపోయిన కారణంగా సమీపంలోని మల్కారం చెరువు మురుగునీటితో కలుషితమైంది. కలుషిత నీరు పొంగి ప్రవహించడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లోని కొన్ని నీటి వనరులు కూడా కలుషితమయ్యాయి. దీంతో జీహెచ్ఎంసీ మల్కారం చెరువులో నీటి శుద్ధి చేపట్టారు. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ మల్కారం చెరువు శుద్ధి పనులను మూడు దశలుగా విభజించింది. దీనిలో భాగంగా మొదటి దశలో దాదాపు 5.7 ఎకరాల్లో శుద్ధి చేశారు. 2017లో తాత్కాలిక చర్యగా రోజుకు 2000 కిలోలీటర్ల మొబైల్ ఆర్వో వ్యవస్థను ప్రారంభించారు. ఆ తర్వాత సామర్థ్యాన్ని 4000 కిలోలీటర్లకు పెంచారు.
దీంతో పాటు అప్పటికే వ్యర్థ జలాలు నిండిన మల్కారం చెరువులోని దాదాపు 11.67 లక్షల కిలో లీటర్ల నీటిని శుద్ధి చేసేందుకు ప్రయత్నాలు కొనసాగాయి. అలాగే ఈ చెరువులోని వ్యర్థ జలాలు పొంగిపొర్లకుండా సుమారు 4 కోట్ల 35 లక్షలతో స్ట్రామ్ వాటర్ డైవర్షన్ నిర్మాణాన్ని కూడా పూర్తి చేసింది. ఇక జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 2020లో సుమారు రూ.250 కోట్లతో జవహర్నగర్ డంప్యార్డులో వ్యర్థ జలాల ట్రీట్మెంట్, మలారం చెరువుతో పాటు కృత్రిమ నీటి గుంటల రిస్టోరేషన్, శుద్ధి కార్యక్రమాన్ని చేపట్టిన రాంకీ సంస్థ ఇప్పటివరకు 43% మేర పనులు పూర్తి చేసింది. మరో ఏడాదిలో మిగిలిన పనులను కూడా పూర్తి చేయనున్నట్లు జీహెచ్ఎంసీ అధికారులు పేర్కొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE