సుదూర ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణం అందించడం కోసం తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) మొదటిసారిగా ఉచిత వై-ఫై సహా హైటెక్ ఫీచర్లతో కూడిన ఏసీ స్లీపర్ బస్సులను ప్రవేశ పెట్టింది. దీనిలో భాగంగా మొదటి దశలో 16 ఏసీ స్లీపర్ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప్రారంభించారు. ఈ మేరకు సోమవారం ఆయన హైదరాబాద్లోని ఎల్బీనగర్లో టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ తదితరుల సమక్షంలో ఈ బస్సులను పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. కాగా ఈ బస్సుల్లో ఉచిత వై-ఫై ఇంటర్నెట్తో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. అలాగే ప్రతి బెర్త్ వద్ద రీడింగ్ ల్యాంప్, వాటర్ బాటిల్ సాకెట్ ఉంటుంది. ఇంకా ప్రయాణికుల భద్రతకు బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలతో పాటు రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా సైతం అందుబాటులో ఉంది. ఈ బస్సులకు టీఎస్ఆర్టీసీ ‘లహరి-అమ్మఒడి అనుభూతి’గా నామకరణం చేసింది. ఈ స్లీపర్ బస్సులను కర్ణాటకలోని బెంగళూరు మరియు హుబ్బలి, ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, తిరుపతి మరియు తమిళనాడులోని చెన్నై రూట్లలో నడపనున్నారు.
ఈ సందర్భంగా మంత్రి పువ్వాడ అజయ్ మాట్లాడుతూ.. ప్రైవేట్ బస్సులకు పోటీగా రూపొందించిన ఈ బస్సులు నేటి నుంచి ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయని వెల్లడించారు. మొత్తం 760 కొత్త బస్సులను కొనుగోలు చేస్తున్నామని, వీటిలో ఇప్పటికే 400 పైగా బస్సులు డిపోలకు చేరుకున్నాయని తెలిపారు. త్వరలోనే 1,300 ఈవీ బస్సులను అందుబాటులోకి తీసుకొస్తున్నామని, ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలు అందించేందుకు ఇప్పటికే ఆర్టీసీలో వీలైనంత సాంకేతికతను ఉపయోగిస్తున్నామని తెలిపారు. 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో మొత్తం 30 బెర్తులు ఉంటాయని, అత్యాధునికమైన ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం (ఎఫ్డీఏఎస్) ఏర్పాటు చేశామని చెప్పారు. కాగా ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలందించేందుకు గాను ఆర్టీసీ ఇటీవలే 630 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ కమ్ సీటర్ 8 బస్సులను, నాన్ ఏసీ స్లీపర్ 4 బస్సులను ప్రవేశపెట్టినట్లు మంత్రి అజయ్ కుమార్ వివరించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE