తెలంగాణలో నకిలీ సర్టిఫికెట్ల బెడదను అరికట్టేందుకు తెలంగాణ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ కొత్త ఆన్లైన్ వెరిఫికేషన్ సిస్టమ్ (పోర్టల్)ను సిద్ధం చేసింది. దేశంలోనే తొలిసారిగా రూపొందించిన ఈ పోర్టల్కు ‘స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్’ (ఎస్ఏవీఎస్) అనే పేరును ఖరారు చేశారు. కాగా దీనిని శుక్రవారం రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో డీజీపీ మహేందర్రెడ్డి, ఐటీశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్, విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొననున్నారు. ఇక దీనిని గురించి ప్రొఫెసర్ లింబాద్రి వివరిస్తూ.. ఈ పోర్టల్ ద్వారా విదేశాల్లో ఉద్యోగాలు, ప్రవేశాలు కల్పించే విద్యాసంస్థలు సులభంగా సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, అలాగే విద్యార్థుల మెమోలు కావాలనుకుంటే డిజిటల్ సంతకం చేసి ఆన్లైన్లో పంపించే వెసులుబాటు ఉందని పేర్కొన్నారు.
సాధారణంగా కరెన్సీ నోట్లలో లభించే భద్రతా ఫీచర్ల మాదిరిగానే విశ్వవిద్యాలయాలు జారీ చేసే సర్టిఫికేట్లు లోగో, వాటర్మార్క్, నిర్దిష్ట కాగితం మందం మరియు ప్రత్యేక కోడ్ నంబర్ వంటి లక్షణాలతో వస్తాయి. ఇన్ని సెక్యూరిటీ ఫీచర్లు ఉన్నప్పటికీ కొందరు సర్టిఫికెట్లను ట్యాంపరింగ్ చేసి నకిలీవి తయారు చేస్తున్నారు. ఇలాంటి సర్టిఫికేట్లను గుర్తించడం ఒక్కోసారి కష్టతరమవుతుంది. దీనికి చెక్ పెట్టడానికే ఇప్పుడు తెలంగాణ విద్యాశాఖ ఈ సరికొత్త పోర్టల్ను అమలులోకి తీసుకురానుంది. కాగా దీనిలో తెలంగాణవ్యాప్తంగా ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల నుంచి గత 12 ఏళ్లలో సర్టిఫికెట్లు పొందిన విద్యార్థుల డేటాను పొందుపరిచారు. ఆయా విశ్వవిద్యాలయాలు జారీ చేసే అన్ని మార్కుల మెమోలు మరియు ఇతర సర్టిఫికేట్లు ఈ పోర్టల్ సర్వర్లో హోస్ట్ చేయబడతాయి. తద్వారా ఈ పోర్టల్లో అభ్యర్థుల హాల్టికెట్ నంబర్ను నమోదు చేస్తే చాలు, ఆ సర్టిఫికెట్ అసలుదో, నకిలీదో తెలిసిపోతుంది.
కాగా ప్రస్తుతం, విదేశీ విశ్వవిద్యాలయాలు, ఉద్యోగులు లేదా విద్యార్థులు సమర్పించిన సర్టిఫికేట్ల వాస్తవికతను తెలుసుకోవాలంటే.. ముందుగా యూనివర్సిటీ అధికారులకు వ్రాసి, సర్టిఫికేట్లను మాన్యువల్గా ధృవీకరించుకోవాలి. ఆ తర్వాత, సర్టిఫికేట్ల ప్రామాణికతపై లేఖను జారీ చేయడం జరుగుతుంది. దీనికి చాలా సమయం పడుతుంది. అయితే కొత్త ప్రక్రియలో భాగంగా, గత 12 ఏళ్లలో విశ్వవిద్యాలయాల నుండి వివిధ అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ మరియు పిహెచ్డి ప్రోగ్రామ్లలో ఉత్తీర్ణులైన విద్యార్థులందరి వివరాలతో కూడిన డేటాబేస్ ఆన్లైన్లో అందుబాటులో ఉంచబడుతుంది. ఇది కాకుండా, కేంద్ర ప్రభుత్వం యొక్క డిజిటల్ లాకర్ల చొరవతో ఈ కొత్త వ్యవస్థను అనుసంధానించే ప్రణాళికలు కూడా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE