రైతుల రుణ మాఫీపై శుక్రవారం నాడు 42 బ్యాంకుల అధికారులుతో బీఆర్కే భవన్ లో రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ, 50 వేల లోపు రైతు రుణమాఫీపై కేబినెట్ సమావేశంలో సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు ఈ సమావేశం నిర్వహించామని చెప్పారు. ఆగస్టు 15వ తేదీన సీఎం కేసీఆర్ లాంఛనంగా 50 వేలలోపు రైతు రుణాల మాఫీ ప్రకటిస్తారన్నారు. ఆగస్టు 16వ తేదీ నుంచే ఆరు లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.2006 కోట్లు జమ అవుతాయని చెప్పారు.
“బ్యాంకర్లు, ప్రభుత్వ అధికారులు సమన్వయంతో రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అయ్యేలా చూడాలి. ఇందుకు తగిన ఏర్పాట్లు బ్యాంకర్లు చేయాలి. రైతుల ఖాతాల్లో రుణ మాఫీ మొత్తం జమ అవగానే సీఎం కేసీఆర్ పేరుతో రైతు రుణం మాఫీ అయినట్లు లబ్ధి దారుల ఫోన్లకు ఎస్.ఎం.ఎస్ వెళ్లాలి. రైతు రుణమాఫీతో పాటు కొత్త పంట రుణానికి మీరు అర్హులని ఆ సందేశంలో తప్పకుండా పేర్కొనాలి. సీఎం పేరున ఎస్ఎంఎస్ సందేశంతో పాటు సదరు బ్యాంకులు సైతం రైతులకు రుణ మాఫీ అయినట్లు స్పష్టమైన సందేశం పంపాలి. రైతుల ఖాతాల్లో జమ అయిన రుణమాఫీ మొత్తాన్ని మరే ఇతర ఖాతా కింద జమ చేయవద్దు. రైతులకు ఇబ్బందులు సృష్టించవద్దు. రుణమాఫీ లబ్దిదారులైన రైతుల ఖాతాలను జీరో చేసి కొత్త పంట రుణం ఇవ్వాలి” అని మంత్రి హరీశ్ రావు ఆదేశాలు ఇచ్చారు.
మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ, రైతుల రుణమాఫీ చెల్లింపుల్లో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని, ప్రభుత్వానికి అన్ని బ్యాంకులు సహకరించాలని కోరారు. బ్యాంకులు ఎలాంటి ఆంక్షలు పెట్టకుండా రైతులకు రుణమాఫీ మొత్తం చేరవేయాలన్నారు. వ్యవసాయ శాఖ తరుపున సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, ఆర్థిక, వ్యవసాయ శాఖ ఉన్నతాధికారులు, ఆయా బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJ