హైదరాబాద్ మహానగర వాసులకు మరో 6 అటవీ ఉద్యానవనాలు (అర్బన్ ఫారెస్ట్ పార్కులు) అందుబాటులోకి వచ్చాయి. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజవర్గంలోని నాగారం, పల్లెగడ్డ, సిరిగిరిపురం, శ్రీనగర్, తుమ్మలూర్, మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్ లను రాష్ట్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు. సందర్శకులకు కల్పించిన సౌకర్యాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ, అడవులను రక్షించాలి, పచ్చదనం పెంచాలి అనే ఏకైక లక్ష్యంతో సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని అన్నారు. హారితహారం కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 258 కోట్ల మొక్కలు నాటామని, ఎనిమిదవ విడతలో 19.54 కోట్ల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అటవీ రక్షణ, పునర్జీవ చర్యలతో దేశమంతా తెలంగాణ వైపు చూస్తుందని చెప్పారు.
“ఆరోగ్యంతో పాటు ఆహ్లాదం కలిగించేలా హైదరాబాద్ తో పాటు పట్టణాల్లో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నాం. మహేశ్వరం నియోజకవర్గంలో ఇవాళ ఒక రోజే ఆరు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రారంభించుకుని ప్రజలకు అందుబాటులోకి తెచ్చాం. సుమారు రూ.22 కోట్లతో హెఛ్ఎండీఏ ఈ పార్కులను అభివృద్ధి చేసింది. సీఎం కేసీఆర్ స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా ఎంపీ సంతోష్ కుమార్ దేశ వ్యాప్తంగా మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. సామాన్యులతో పాటు సెలబ్రిటీలను, పారిశ్రామిక వేత్తలను కూడా ఇందులో భాగస్వామ్యులను చేశారు” అని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ఆలాగే మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ, “కాంక్రీట్ జంగిల్ గా మారిన హైదరాబాద్ చుట్టుపక్కల అర్బన్ లంగ్ స్పేస్ క్రియేట్ చేసేందుకు అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నందుకు సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. విజన్ తో పనిచేస్తే అనుకున్న ఫలితాలు సాధించవచ్చు అనడానికి హరిత హారం కార్యక్రమం నిదర్శనం. గతంలో మొక్కలు నాటడం మొక్కుబడి కార్యక్రమంలా ఉండేది.. కానీ సీఎం కేసీఆర్ దీన్ని ఒక యజ్ఞంలా మార్చి, ప్రజలందరినీ భాగస్వామ్యులను చేశారు. పచ్చదనం పెంపొందించేందుకు కృషి చేస్తున్న అటవీ శాఖ, హెఛ్ఎండీఏకు అభినందనలు. అటవీ భూములను, అర్బన్ ఫారెస్ట్ పార్కులను కాపాడుకోవాల్సిన బాధ్యత స్థానికులపై ఉంది. వారంలో ఒక రోజు స్థానికులకు ఉచితంగా ఎంట్రీ కల్పిస్తాం” అని చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ వాణి దేవి, జెడ్పీ చైర్ పర్సన్ తీగల అనితా రెడ్డి, అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డోబ్రియల్, పీసీసీఎఫ్ (కంపా) లోకేష్ జైస్వాల్, హెఛ్ఎండీఏ డైరెక్టర్ ప్రభాకర్, హెఛ్ఎండీఏ ఎస్.ఈ. హుస్సేన్, హెఛ్ఎండీఏ అసిస్టెంట్ డైరెక్టర్ రాములు, ఎఫ్డీఓ విజయానంద రావు, వైల్డ్ లైఫ్ బోర్డ్ మెంబర్ రాఘవ, ఇతర అధికారులు, స్థానిక ప్రజాప్రతినిదులు, తదితరులు పాల్గొన్నారు.
నేడు ప్రారంభమైన అర్బన్ ఫారెస్ట్ పార్క్ ల వివరాలు:
రాష్ట్ర వ్యాప్తంగా 109 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. రూ.700 కోట్ల అంచనా వ్యయంతో అర్బన్ ఫారెస్ట్ పార్కులను ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటి వరకు రూ.400 కోట్ల వెచ్చించి మొత్తం 39 అర్బన్ ఫారెస్ట్ పార్కులను ప్రజలకు అందుబాటులో తీసుకువచ్చారు. ఇవాళ మరో 6 అర్బన్ ఫారెస్ట్ పార్కులను కలుపుకుని మొత్తం 45 అర్బన్ ఫారెస్ట్ పార్కులు ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. సందర్శకుల కోసం ఎంట్రీ ప్లాజా, విజిటర్స్ పాత్వే, ఇంటర్ప్రెటేషన్ షేడ్ సఫారి ట్రాక్, గజేబో, వాచ్ టవర్, గ్యాప్ ప్లాంటేషన్, అటవీ ప్రాంతం అంతా రక్షణ గోడ (చైన్ లింక్ ఫెన్సింగ్, సీత్రూ వాల్), బోర్ వెల్, పైప్ లైన్, ఇతర సౌకర్యాలను కల్పించారు.
- నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్: అవుటర్ రింగ్ రోడ్ కు 7 కిలోమీటర్ల దూరంలో మహేశ్వరం మండలం పెద్దపులి నాగారంలో 556.69 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.17 కోట్ల వ్యయంతో నాగారం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను హెఛ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
- పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్: మహేశ్వరం మండలం హర్షగూడ గ్రామంలో 87.41హెక్టార్ల విస్తీర్ణంలో రూ.2.98 కోట్ల వ్యయంతో పల్లెగడ్డ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను హెఛ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
- సిరిగిరిపురం అర్బన్ ఫారెస్ట్ పార్క్: మహేశ్వరం మండలం సిరిగిరిపురం గ్రామంలో 102.39 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.8 కోట్ల వ్యయంతో సిరిగిరిపురం అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను హెఛ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
- శ్రీనగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్: తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలో శ్రీనగర్ గ్రామంలో 526. 91హెక్టార్ల విస్తీర్ణంలో రూ.8.34 కోట్ల వ్యయంతో శ్రీనగర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను హెఛ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
- తుమ్మలూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్: కందుకూర్ మండలం తూమలూర్ గ్రామంలో 161.87 హెక్టార్ల విస్తీర్ణంలో తూమలూర్ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను టీఎస్ఐఐసీ అభివృద్ధి చేసింది.
- మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్: కందుకూర్ మండలం లేమూర్ గ్రామంలో 58.78 హెక్టార్ల విస్తీర్ణంలో రూ.3.49 కోట్ల వ్యయంతో మన్యంకంచ అర్బన్ ఫారెస్ట్ పార్క్ ను హెఛ్ఎండీఏ అభివృద్ధి చేసింది.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEY