కేంద్ర ప్రభుత్వం ద్వారా నగరాలలో మౌలిక సదుపాయాలు, ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించే పథకాల అమలు తీరును పరిశీలించేందుకు కేంద్ర పట్టణాభివృద్ధి, హౌసింగ్ వ్యవహారాలపై నియమించిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ హైదరాబాద్ లో పర్యటించింది. ఈ పర్యటన సందర్భంగా కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు తీరును సమీక్షించారు. సోమవారం హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్లమెంటరీ స్థాయి సంఘం కమిటీ సభ్యులు గృహనిర్మాణం, స్వచ్ఛ భారత్, అమృత్, హెచ్.ఆర్.ఎం.ఏ, జలమండలి, వివిధ బ్యాంకు అధికారులతో సమీక్షించారు.
ఈ సందర్భంగా పార్లమెంటరీ కమిటీ సభ్యులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతి కుమారి రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, ప్రగతిని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమం గురించి సీఎస్ వివరిస్తూ, తెలంగాణలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలతో పాటు ఎవెన్యూ ప్లాంటేషన్ పెద్ద ఎత్తున చేపట్టడం జరిగిందన్నారు. తద్వారా గణనీయంగా అటవీ విస్తీర్ణానికి దోహద పడిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గ్రీనరీ గణనీయంగా పెరిగిందన్నారు. ఏడు శాతం అదనంగా పెరిగినట్లు, ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించినట్లు సభ్యులకు శాంతి కుమారి వివరించారు. ఇంక్రిమెంటల్ గ్రీన్ కవరేజ్ కింద, అర్బన్ ఫారెస్ట్ బ్లాక్ కింద 177 అర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్ లను ప్లాంటేషన్ చేపట్టి 20 కోట్ల ప్లాంటేషన్ పూర్తి చేయడం జరిగిందన్నారు. తెలంగాణకు హరితహారం కార్యక్రమం ద్వారా రాష్ట్రం హరిత తెలంగాణగా మారిందన్నారు. అర్బన్ ఫారెస్ట్ పునరుద్ధరణ, స్వయం సహాయ సంఘాలకు బ్యాంకు లింకేజీ పెద్ద ఎత్తున అందిస్తున్నామని, రాష్ట్రంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు మార్గదర్శకత్వంలో సంక్షేమ అభివృద్ధి పథకాలు అమలు తీరుకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభిస్తుందని సీఎస్ తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్రంలో మున్సిపల్ శాఖ చేపడుతున్న పనులను మున్సిపల్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్లమెంట్ కమిటీ సభ్యులకు వివరించారు. మున్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అరవింద్ కుమార్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి పరిచేందుకు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ చట్టం ద్వారా అర్బన్ లోకల్ బాడీ సంఖ్యను 68 నుండి 142 కు పెంచామని తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా సువిశాల రోడ్లు, ఎల్ఈడీ లైట్లు, వెజ్ నాన్ వెజ్ మార్కెట్లు, వైకుంఠధామాలు, ఓపెన్ జిమ్స్, స్టేడియంలు, గ్రీనరీ, ఆన్లైన్ బిల్డింగ్ పర్మిషన్ లు, అర్బన్ ఫారెస్ట్ డెవలప్మెంట్, స్మార్ట్ సిటీ గా వరంగల్, కరీంనగర్ నుతీర్చిదిద్దడం, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లకు బ్యాంకు లింకేజీ, డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు తదితర పథకాల పురోగతి ని వివరించారు. ప్రభుత్వ పక్కా ప్రణాళికతో గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థలు అభివృద్ధి పథంలో పయనిస్తున్నాయని పేర్కొన్నారు. సఫాయి కర్మచారి, స్వచ్ఛ సర్వేక్షన్ అవార్డులు తెలంగాణ రాష్ట్రానికి పెద్ద ఎత్తున వస్తున్నాయని అన్నారు.
మున్సిపల్ శాఖ డైరెక్టర్ సత్యనారాయణ మాట్లాడుతూ, శానిటేషన్, ప్రాపర్టీ ట్యాక్స్ అసెస్మెంట్, వేస్ట్ మేనేజ్మెంట్, రీసైక్లింగ్ డంప్ యార్డ్, కంపోస్ట్ చర్యలను పెద్ద ఎత్తున చేపట్టామని, చెత్తతో సంపద సృష్టించే చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. హైదరాబాద్ జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దాన కిషోర్ మాట్లాడుతూ, కాంప్రహెన్సివ్ సీవరేజ్ మాస్టర్ ప్లాన్ అనుసరించి ఆగస్టు నాటికి 100% సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లను పూర్తి చేస్తామన్నారు. ప్రధానమంత్రి స్వనిధి కింద వీధి వ్యాపారులకు అందిస్తున్న రుణాలపై వివరాలను బ్యాంకర్లు వివరించారు. మెట్రో ఎండీ ఎన్విఎస్ రెడ్డి మాట్లాడుతూ, హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి మియాపూర్ వరకు జేబీఎస్ నుండి ఎంజీబీఎస్ వరకు, నాగోల్ టు రాయదుర్గం వరకు, ఎలివేటెడ్ మెట్రో నిర్మాణాన్ని చేపట్టామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధులతో రాయదుర్గం నుండి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ వరకు మెట్రో రైల్ నిర్మాణానికి చర్యలు చేపట్టామన్నారు. మెట్రో రైల్ పొడిగింపు కోసం కేంద్ర ప్రభుత్వం నుండి రూ.254 కోట్లు మంజూరు చేయాలని కోరారు.
పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చైర్ పర్సన్ లాలన్ సింగ్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో స్టాండింగ్ కమిటీలో సభ్యులైన పలువురు లోక్ సభ, రాజ్యసభ ఎంపీలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో జిహెచ్ఎంసి కమిషనర్ డి.ఎస్ లోకేష్ కుమార్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు సెక్రటరీ నీతూ ప్రసాద్, ట్రాన్స్పోర్ట్, రోడ్లు భవనాల శాఖ సెక్రటరీ శ్రీనివాసరాజు, జిహెచ్ఎంసి హౌసింగ్ ఓఎస్డీ సురేష్ కుమార్, వివిధ బ్యాంక్ ఉన్నతాధికారులు, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE