భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికై ఐదు రోజుల పర్యటనలో భాగంగా డిసెంబర్ 26, సోమవారం సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు (డిసెంబర్ 27మంగళవారం) పర్యటనలో భాగంగా హైదరాబాద్లోని కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యార్థులు మరియు అధ్యాపకులను ఉద్దేశించి రాష్ట్రపతి ప్రసంగించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రాంతీయ స్వాతంత్య్ర సమరయోధుల కృషిని ప్రదర్శించే ‘హైదరాబాద్ విమోచన ఉద్యమం’పై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ను కూడా రాష్ట్రపతి ప్రారంభించారు.
ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ, దేశ నిర్మాణానికి విద్య పునాది అని అన్నారు. ప్రతి వ్యక్తి యొక్క పూర్తి సామర్థ్యాన్ని అన్లాక్ చేయడానికి విద్య కీలకమని చెప్పారు. కేశవ్ మెమోరియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యకలాపాలు 1940లో ఒక చిన్న పాఠశాలతో మొదలై, నేడు తొమ్మిది విభిన్న కళాశాలలతో, 11,000 మంది విద్యార్థులతో ఒక ప్రధాన విద్యా కేంద్రంగా అనేక రెట్లు వృద్ధి చెందడాన్ని గమనించి రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. జస్టిస్ కేశవరావు కోరాట్కర్ స్మృతిలో భాగంగా ఏర్పాటైన ఈ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆయన ఆశయాలకు గొప్ప నివాళి అని ఆమె అన్నారు. అలాగే హైదరాబాద్ విమోచన 75వ వార్షికోత్సవ వేడుకలను ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో భాగంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రాంత ప్రజలకు మరియు మొత్తం దేశానికి ఇది గొప్ప ప్రాముఖ్యతను కలిగి ఉందని రాష్ట్రపతి అన్నారు. హైదరాబాద్ విముక్తి కోసం పోరాడిన రాంజీ గోండ్, తుర్రేబాజ్ ఖాన్, కొమరం భీమ్, సురవరం ప్రతాప్ రెడ్డి, షోయాబుల్లాఖాన్ వంటి వీర నాయకులకు ఆమె నివాళులర్పించారు. వారి శౌర్యాన్ని, త్యాగాన్ని ఎప్పటికీ గుర్తుంచుకుంటామని, గౌరవిస్తామనిన ఆమె అన్నారు.
ఈ సందర్భంగా రీడింగ్/చదవడం యొక్క ప్రాముఖ్యతను రాష్ట్రపతి నొక్కి చెప్తూ, స్వీయ అభివృద్ధికి అత్యంత ప్రభావవంతమైన మార్గాలలో చదివే అలవాటు ఒకటని అన్నారు. ఇది విద్యార్థులకు వారి జీవితాంతం బాగా ఉపయోగపడే నైపుణ్యమని తెలిపారు. ఇది ఇంటర్నెట్ మరియు సోషల్ మీడియా యుగం అని, దృష్టి సారించే పరిధి తగ్గిపోతుందని మరియు కమ్యూనికేషన్ అక్షరాల్లో పరిమితం చేయబడిందని అన్నారు. విద్యార్థులు తమ అవగాహనను పెంపొందించుకోవడానికి మరియు వారి దృక్పథాన్ని విస్తృతం చేయడానికి మరింత చదవాలని రాష్ట్రపతి సూచించారు. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీని సందర్శించి ఆఫీసర్ ట్రైనీస్ ఆఫ్ ఇండియన్ పోలీస్ సర్వీస్ (74వ ఆర్ఆర్ బ్యాచ్)ని ఉద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం హైదరాబాద్లో మిశ్రా ధాతు నిగమ్ లిమిటెడ్ (మిధాని) వైడ్ ప్లేట్ మిల్ కూడా ప్రారంభిస్తారు.
మ్యాంగో న్యూస్ లింక్స్:
టెలీగ్రామ్ : https://t.me/mangonewsofficial
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xE