రాష్ట్రంలో కరోనా వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఐసీఎంఆర్ ఆమోదించిన 18 ప్రైవేట్ ల్యాబ్స్ కు ఇటీవలే తెలంగాణ ప్రభుత్వం అనుమతించిన సంగతి తెలిసిందే. అయితే హైదరాబాద్ లో పలు ప్రైవేటు ల్యాబ్ లు తాత్కాలికంగా కరోనా పరీక్షలు నిలిపివేయాలని నిర్ణయించినట్టు తెలుస్తుంది. జూలై 2 నుంచి జూలై 5వ తేదీ వరకు నాలుగు రోజుల పాటుగా శాంపిల్స్ సేకరణ నిలిపివేసి, జూలై 6 నుంచి తిరిగి పరీక్షలు ప్రారంభించనున్నట్టు సమాచారం.
ఖచ్చితమైన నిర్ధారణ, ఫలితాల నమోదులో లోపాలు ఉండడంతో ఇటీవలే రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అధికారుల బృందం పలు ప్రైవేట్ ల్యాబ్స్ ను సందర్శించి కీలక సూచనలు చేసింది. లోపాలను గుర్తించి, 48 గంటల్లో సవరించు కోవాలని ఆదేశాలు జారీ చేయగా ఇప్పటికే కొన్ని ల్యాబ్స్ తప్పులను సరిదిద్దుకున్నాయి. కాగా శాంపిల్స్ సేకరించే సిబ్బందికి శిక్షణ ఇవ్వడం మరియు డిజ్ ఇన్ఫెక్షన్ కోసం 4 రోజుల పాటు పరీక్షల నిర్వహణను స్వచ్చంధంగా నిలిపివేసేందుకు ప్రైవేట్ ల్యాబ్స్ నిర్ణయించుకున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల నుంచి శాంపిల్స్ వస్తే పరీక్షలు నిర్వహిస్తామని, నేరుగా ల్యాబ్కు వచ్చే కరోనా అనుమానితుల నుంచి శాంపిల్స్ సేకరించమని పేర్కొన్నాయి. మరోవైపు ప్రైవేట్ ల్యాబ్స్ కరోనా పరీక్షలు నిలిపివేసే అంశంపై వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.
మ్యాంగో న్యూస్ యాప్ లింక్స్:
గూగుల్ ప్లే స్టోర్ : https://bit.ly/2R4cbgN
ఆపిల్/ఐఓఎస్ స్టోర్ : https://apple.co/2xEYFJu